
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యవహారంపై ఆ పార్టీ మరో ఎంపీ సుజనా చౌదరీ స్పందించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీలో సీనియర్ నేత అని, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని మీడియా ద్వారానే తాను చూశానని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ రోజు కూడా ఆయనతో తాను మాట్లాడానని చెప్పారు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే పార్లమెంటుకు రాలేకపోయానని తనతో జేసీ చెప్పారని తెలిపారు. పార్టీపై ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే.. అది మాతో చెబితే చర్చించుకుని సరి చేసుకుంటామన్నారు. రేపటి (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ పార్లమెంటుకు హాజరు అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జేసీతో మాట్లాడుతున్నారని సుజనా మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment