
సాక్షి, అమరావతి : గత టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం శాసన మండలిలో సంక్షేమ పథాకాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు తన పాలనలో రైతులను అన్ని విధాల మోసం చేశారని అందుకే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు పెద్ద పీట వేసిందని, వారి సంక్షేమానికి, అభివృద్దికి ప్రత్యేక వ్యుహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. రైతుల రుణమాఫీకి నిధులు లేవన్న చంద్రబాబుకు పసుపు, కుంకుమకు మాత్రం నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదని, రైతుల కోసం కేటాయించిన 2వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడిని టీడీపీ ప్రభుత్వం ఎగ్గోట్టిందని ఆరోపించారు.
అయితే తాము అధికారంలోకి రాగానే శనగ, పామాయిల్ రైతులను ఆదుకున్నామని, ఇప్పుడు ఈ నిధులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. అలాగే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. తమది రైతు ప్రభుత్వమని తెలిపారు. అదే విధంగా రైతుల కోసం ఏం చేయడానికైనా తాము ఎప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. కాగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని ఈ విషయం గురించి అధికారులు చెబుతున్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.