
ఎస్బిఐ ఆర్ఎం వి.కృష్ణమోహన్
ఒంగోలు: నిరర్థక ఆస్తుల పరిష్కారం కోసం చిన్న/సన్నకారు రైతులకు, చిన్నమొత్తాల రుణ వినియోగదారులకు ఏక మొత్తం చెల్లించే పద్ధతిలో రుణసమాధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సంబంధిత బకాయిదారులు వన్టైం సెటిల్మెంట్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజనల్ మేనేజర్ వి.కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒంగోలు రీజియన్ పరిధిలో రూ.25 లక్షల లోపు రుణాలు ఉన్నవారు మాత్రమే రుణసమాధాన్ కిందకు వస్తారన్నారు. ఇటువంటి వారు 17,270 మంది ఉన్నారని, వారి నుంచి రూ.69.34 కోట్లు నిరర్థక ఆస్తులుగా ఉన్నాయన్నారు.
దీనికిగాను రుణ గ్రహీతలు తాము ఏ బ్రాంచి నుంచి అయితే రుణాన్ని తీసుకున్నారో ఆ బ్రాంచిలో ఆధార్ కార్డు/ పాన్కార్డు వివరాలతో వెంటనే సంప్రదించాలన్నారు. వారి పేరు నమోదు చేయించుకొని వడ్డీలో పూర్తి రాయితీ, నికర బకాయిలో 50 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉందన్నారు. ఈ పథకం కేవలం ఈనెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఈ పథకం కింద రుణం తీర్చిన వారికి మళ్లీ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం నూతనంగా కూడా రుణం మంజూరు చేస్తామని ఆర్ఎం.వి.కృష్ణమోహన్ తెలిపారు.