
లండన్: ప్రపంచకప్లో వరుస ఓటములతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అనధికారికంగా సెమీస్ పోరు నుంచి తప్పుకున్న పాక్ కనీసం గౌరవం కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ముఖ్యంగా టీమిండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత పాక్ ఆటగాళ్లపై ఆ జట్టు అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్పై ఓటమికి సారథి సర్ఫరాజ్ అహ్మదే కారణమంటూ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే పాక్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ మాత్రం సర్ఫరాజ్కు మద్దతుగా నిలిచాడు.
‘ఆటలో గెలుపోటములు సహజం. ఎవరూ కావాలని ఓడిపోరు. ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో టీమ్ వ్యూహంలో భాగంగానే సర్ఫరాజ్ టాస్ గెలిచాక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ మేము బౌలింగ్ అనుకున్న విధంగా చేయలేదు. కొన్ని సార్లు మేము అనుకున్న వ్యూహాలు విఫలమవుతాయి. అంతమాత్రాన ఎవరినీ నింధించాల్సిన అవసరం లేదు. గెలుపైనా, ఓటమైనా జట్టు సభ్యులందరదీ. కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం సరికాదు. ఇప్పటికీ పాక్కు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. మిగతా మ్యాచ్లు కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నాం’అంటూ హఫీజ్ పేర్కొన్నాడు.
చదవండి:
నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా!
పాక్ జట్టును రద్దు చేయాలంటూ పిటిషన్!