భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్పై డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల మరోసారి విరుచుకుపడింది.
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్పై డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల మరోసారి విరుచుకుపడింది. ఐబీఎల్లో ఢిల్లీ జట్టు ఆటగాళ్లను మ్యాచ్ ఆడకుండా అడ్డుకుందనే ఆరోపణలపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) జ్వాలపై జీవిత కాల నిషేధం విధించాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తన సొంత రాష్ట్రానికే చెందిన గోపీచంద్ ఎందుకు స్పందించడం లేదని మరోమారు ప్రశ్నించింది.
‘నా విషయంలో చీఫ్ కోచ్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడో అర్థం కావడం లేదు. మాజీ కోచ్లు ఆరిఫ్, బంగా బీట్స్ కోచ్ విమల్ తమ వాదనను బయటికి వినిపించారు. వారు మాట్లాడినప్పుడు గోపీచంద్ ఎందుకు మాట్లాడడు? నా ఉద్దేశంలో ఆయన అకాడమీకి మాత్రమే కోచ్ కాడు. భారత బ్యాడ్మింటన్కు కూడా కోచ్ ఆయనే. ఏదో ఒక వైఖరి మీద ఆయన ఉండాలి’ అని జ్వాల సూచించింది. మరోవైపు తనపై విచారణ కోసం బాయ్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై స్టే విధించాలని కోరిన జ్వాల వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.