
అతడే నాకు అండ: అమిత్ మిశ్రా
విశాఖపట్నం: తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం పట్ల టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో శనివారం జరిగిన ఐదో వన్డేలో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ... 'నా కెరీర్ లో ఆరోజు చాలా మంచి ప్రదర్శన చేశాను. నేను వికెట్లు తీయాలని ప్రతిఒక్కరు ఆశిస్తారు. అంచనాలకు అనుగుణంగా రాణించాను. గతంలో సాధించిన వాటి గురించి ఆలోచించలేదు. ఈరోజు మ్యాచ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాను. తదనుగుణంగా బౌలింగ్ చేశాన'ని అమిత్ మిశ్రా తెలిపాడు.
టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలబడడం వల్లే తానేంటో నిరూపించుకున్నానని అన్నాడు. కుంబ్లే సహకారం ఎప్పటికీ మరువలేనని, తన కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అమిత్ మిశ్రా గతంలోనూ సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. కివీస్ తో ముగిసిన 5 వన్డేల సిరీస్ లో 15 వికెట్లు పడగొట్టి ఈ టోర్నిలో టాప్ బౌలర్ గా నిలిచాడు.