ఐఎస్ఎల్ తొలి సీజన్లో సెమీఫైనల్ దాకా చేరిన ఎఫ్సీ గోవా జట్టు సొంత మైదానంలో సత్తా చూపింది. ఆదివారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన తమ ఆరంభ మ్యాచ్ను 2-0తో నెగ్గింది.
ఫటోర్డ (గోవా): ఐఎస్ఎల్ తొలి సీజన్లో సెమీఫైనల్ దాకా చేరిన ఎఫ్సీ గోవా జట్టు సొంత మైదానంలో సత్తా చూపింది. ఆదివారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన తమ ఆరంభ మ్యాచ్ను 2-0తో నెగ్గింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వీరికిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మ్యాచ్ మూడవ నిమిషంలోనే గోవా జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఢిల్లీ ఆటగాడు సౌవిక్ బంతిని అడ్డుకునే ప్రయత్నంలో పొరపాటు చేయడంతో అది తమ సొంత గోల్పోస్టులోకే వెళ్లడంతో మూల్యం చెల్లించుకున్నారు. 12వ నిమిషంలో తమకు లభించిన మరో అవకాశాన్ని గోవా చేజార్చుకుంది. అయితే 45వ నిమిషంలో రినాల్డో గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి బంతిని నెట్లోకి పంపడంతో ఆధిక్యం పెరిగింది. బ్రెజిల్ దిగ్గజం రాబర్టో కార్లోస్ ద్వితీయార్ధంలో ఢిల్లీ తరఫున ఐఎస్ఎల్లో అరంగేట్రం చేశాడు. అయినా ఫలితం దక్కలేదు.