
టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఏడు నెలల తర్వాత మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్లో పేస్ 14 స్థానాలను మెరుగుపరుచుకొని 47వ ర్యాంకును అందుకున్నాడు. అమెరికాకు చెందిన జేమ్స్ సెరిటానితో కలిసి తాజాగా న్యూపోర్ట్ బీచ్ టైటిల్ నెగ్గిన పేస్ ఖాతాలో 125 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. భారత్ తరఫున డబుల్స్లో రోహన్ బోపన్న (20వ స్థానం) అత్యుత్తమ స్థానంలో నిలవగా, దివిజ్ శరణ్ మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్ బెస్ట్ 45వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ 118వ ర్యాంకులో, రామ్కుమార్ రామనాథన్ 140వ స్థానంలో ఉండగా... సుమిత్ నాగల్ (218), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (244), శ్రీరామ్ బాలాజీ (391) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ సానియా మీర్జా ఒక స్థానం పడిపోయి 14వ ర్యాంక్కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment