
క్రికెట్ కెప్టెన్ గా చివరి సిరీస్?
తాను క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనంటూ ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై తిరుగుబాటు జెండా ఎగురేసిన మిస్సావుల్ హక్ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది.
కరాచీ: తాను క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనంటూ ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై తిరుగుబాటు జెండా ఎగురేసిన మిస్సావుల్ హక్ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్ తో జరుగనున్న టెస్టు సిరీస్ తరువాత మిస్బావుల్ ను సాగనంపేందుకు పీసీబీ సమాయత్తమైంది. ఈ మేరకు మిస్బావుల్ హక్ తప్పుకోవాల్సిందిగా పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ సూత్రప్రాయంగా సూచించారు.
'మిస్బావుల్ హక్ నన్ను కలవడానికి గతవారం అపాయింట్ మెంట్ తీసుకున్నాడు. దాంతో మిస్బావుల్ ను కలిసి అతని నాయకత్వంపై సుదీర్ఘంగా చర్చించా. ఈ క్రమంలోనే అతని క్రికెట్ కెరీర్ పై కూడా ఒక నిర్ణయానికి రావాలని సూచించా. ఇక అతని క్రికెట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వెస్టిండీస్ తో సిరీస్ కు మిస్బావుల్ హక్ నే కెప్టెన్ గా నియమించాం. అతని క్రికెట్ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నా. ప్రస్తుతం 43 ఒడిలో ఉన్న మిస్బా.. విండీస్ తో సిరీస్ తో తరువాత ఆడతాడని నేను అనుకోవడం లేదు'అని షహర్యార్ ఖాన్ తెలిపారు.
ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించాలనే పీసీబీ భావిస్తోంది. దీనిలో భాగంగా అజహర్ అలీని ఇప్పటికే వన్డే కెప్టెన్ గా పీసీబీ తప్పించింది. ఇప్పుడు టెస్టు కెప్టెన్ మిస్బావుల్ వీడ్కోలుకు విండీస్ తో సిరీస్ ద్వారా ముగింపు పలికేందుకు ప్రణాళిక రూపొందించింది. ట్వంటీ 20 కెప్టెన్ గా సర్ఫరాజ్ ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా చేసే క్రమంలోనే పీసీబీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.