భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది.
జ్వాల జోడికి చుక్కెదురు
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్
బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో 21-15, 21-15తో క్వాలిఫయర్ కిమ్ హో మిన్ (జపాన్)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత అమ్మాయి ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్లో 12-7 ఆధిక్యంలో నిలిచింది. అయితే కిమ్ పుంజుకుని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 10-12కు తగ్గించింది.
కానీ స్కోరు 15-11 వద్ద సైనా నాలుగు పాయింట్లు నెగ్గితే... కిమ్ రెండింటితో సరిపెట్టుకుంది. చివరకు మరో రెండు పాయింట్లతో హైదరాబాదీ గేమ్ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్లోనూ అదే జోరును కనబర్చిన సైనా 11-5 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మరో మూడు పాయింట్లు నెగ్గింది. అయితే స్కోరు 20-12 వద్ద కిమ్ మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా.. విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో జ్వాల-అశ్విని జోడి 10-21, 13-21తో టాప్సీడ్ చైనీస్ జంట టియాన్ క్వింగ్-జాహో యునెలి చేతిలో కంగుతింది.
‘క్రికెట్ చూడడం మా హక్కు’
జైళ్లో పంతం నెగ్గించుకున్న ఖైదీలు
గువాహటి: ప్రపంచకప్ క్రికెట్ ఎంతలా అందరినీ ఉర్రూతలూగిస్తుందో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలేమో... ‘క్రికెట్ చూడడం మా హక్కు’ అంటూ కొందరు ఖైదీలు గౌహతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి వాదనకు సానుకూలంగా స్పందించిన జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామి ‘ఖైదీల మనస్సు ఆరోగ్యంగా ఉండేందుకు వినోదం చాలా అవసరం’ అని ఐదు రోజుల్లో జైళ్లో కేబుల్ కనెక్షన్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు.