
అమ్మకానికి రాయల్ చాలెంజర్స్ టీమ్!
ఐపీఎల్ జట్టును కొననున్న జిందాల్ గ్రూప్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో అనూహ్య మార్పు! విజయ్ మాల్యాకు చెందిన ‘కలర్ఫుల్’ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు చేతులు మారనున్నట్లు తెలిసింది. లీగ్లో ప్రస్తుతం ఉన్న జట్లలో ఒకదానిని కొనుగోలు చేస్తున్నట్లు జేఎస్డబ్ల్యూ స్టీల్ (జిందాల్ గ్రూప్) ప్రకటించింది.
ఆ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ‘మన దేశంలో క్రికెట్ నంబర్వన్ క్రీడ. అందుకే ఒక ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. డబ్బులు సమస్య కాదు. ఒక గుర్తింపు ఉన్న జట్టును తీసుకొని క్రీడలను ప్రోత్సహించాలనేది మా ఆలోచన.’ అని ఆయన చెప్పారు. తాను కొనే జట్టు ఏదనేది ఆయన స్పష్టంగా చెప్పకపోయినా... అది బెంగళూరు టీమ్ అని సమాచారం.
ప్రస్తుతం ఫుట్బాల్ ఐ-లీగ్లోని బెంగళూరు ఎఫ్సీ ఈ గ్రూప్కు చెందిందే కావడం విశేషం. యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా 2008లో 111.6 మిలియన్ డాలర్లకు బెంగళూరు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డివిలియర్స్లాంటి స్టార్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టు ఎనిమిది సీజన్లలో ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేకపోయింది. ఇతర ఆర్థిక పరమైన సమస్యల కారణంగా కూడా మాల్యా ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.