
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ రజత పతకాన్ని ఖాయం చేసుకున్నారు.. సోమవారం జరిగిన మహిళల రెజ్లింగ్ పోరులో భాగంగా 50 కేజీల ఫ్రీస్టైయిల్ విభాగంలో ఫోగట్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్ పోరులో వినేశ్ ఫోగట్ 10-0 తేడాతో యక్షిమురతోవా( ఉజ్బెకిస్తాన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న ఫోగట్.. పసిడికి అడుగు దూరంలో నిలిచారు. ఈ రోజు సాయంత్రం జరుగనున్న స్వర్ణ పత పోరులో జపాన్కు చెందిన ఇరి యుకితో ఫోగట్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ 8-2 తేడాతో చైనా రెజ్లర్ యనన్ సున్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించారు.
కాగా, పింకీ(53కేజీలు) తొలి బౌట్లోనే నిష్క్రమించింది. ఇక పూజ దండా( 57 కేజీలు), సాక్షి మాలిక్(62 కేజీల విభాగం) లు సెమీస్లో పరాజయం చెందారు. దాంతో కాంస్య పతక పోరులో తలపడే మరో అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి సాకగామి కాట్సుకితో పూజా దండా తలపడనుండగా, టినిబెకోవాతో సాక్షి తలపడనుంది.