
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవితా పూనియాను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు. 13 ఏళ్ల తర్వాత భారత మహిళల జట్టు ఆసియా కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సవితకు ఇంకా ఉద్యోగమే లేదు. తొమ్మిదేళ్లుగా జాతీయ జట్టులో నిలకడగా రాణిస్తున్న తనకు ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడం బాధిస్తోందని మీడియాతో పేర్కొంది. దీనిపై మంత్రి రాథోడ్ స్పందించారు.
‘సవితకు ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందజేసేలా మా క్రీడాశాఖ అధికారులను ఆదేశించాను. దీనిపై పూర్తి వివరాలను సేకరించాలని వారికి చెప్పా. దేశానికి పేరుతెచ్చే క్రీడాకారులకు తగిన గౌరవ మర్యాదలు దక్కేలా చూడటమే మా ప్రధాన ఉద్దేశం’ అని రాథోడ్ ట్వీట్ చేశారు.