దిగువసభలో రెండోరోజైన గురువారం కూడా జాగరణ కొనసాగింది. డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి
చట్టసభల్లోనే నిద్రించిన విపక్షాలు
గణపతి ఆత్మహత్యపై చల్లారని వేడి
ఉదయం విధాన సౌధ ప్రాంగణంలో వ్యాహాళీ
బెంగళూరు: దిగువసభలో రెండోరోజైన గురువారం కూడా జాగరణ కొనసాగింది. డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ రాజీనామా ప్రధాన డిమాండ్గా విపక్షాలు బుధవారం రాత్రి నుంచి చట్టసభల్లో అహోరాత్రి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం రాత్రి శాసనసభ, శాసనమండలిలోనే నిద్రించిన ఆయా చట్టసభల సభ్యులు గురువారం ఉదయం విధానసౌధలోనే మార్నింగ్ వాక్తో తమ దినచర్యను ప్రారంభించి అక్కడే అల్పాహారాన్ని కూడా తీసుకున్నారు. అనంతరం చట్టసభల్లోని స్పీకర్, మండలి అధ్యక్షుడి పోడియంలోకి వెళ్లి నిరసనకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక గురువారం ఉదయం విపక్షాల నిరసలన మధ్యనే శాసనసభలో సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కే.జే జార్జ్ను మంత్రి మండలి నుంచి తొలగించడంతో పాటు గణపతి ఆత్మహత్య ఘటనను సీబీఐ చేత దర్యాప్తునకు అంగీకరించేంతవరకూ తమ నిరసనను విరమించబోమని విపక్ష సభ్యులు తేల్చిచెప్పారు.
అయితే ఇందుకు అధికార పక్షం నాయకులు ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, జేడీఎస్లు నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంలో కర్ణాటక ఓపెన్ యూనివర్శిటీతో సహా మూడు ముసాయిదా చట్టాల అనుమతి కోసం అధికారపార్టీ దిగువసభ అనుమతి కోసం ప్రవేశపెట్టింది. దీంతో మరింత ఆగ్రహం చెందిన విపక్ష పార్టీల సభ్యులు ముసాయిదా చట్టం ప్రతులను చించి వేసి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ కోడివాళ సభా కార్యక్రమాలను నిలిపి వేసి అన్ని పార్టీల ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సభా కార్యక్రమాలు సజావుగా జరపడానికి సహకరించాలని సూచించారు. అయితే అటు విపక్ష సభ్యులు కాని, ఇటు అధికార పార్టీ నాయకులు కాని వెనక్కు తగ్గక పోవడంతో శాసనసభ సమావేశాలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోళివాడ వెల్లడించారు. సమావేశం అనంతరం శాసనసభ విపక్షనాయకుడు జగదీష్శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ... తమ డిమాండ్లో ఎటువంటి మార్పు లేదని, కే.జేజార్జ్ రాజీనామా చేసేవరకూ ఉభయ సభల్లో అహోరాత్రి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.