
విమానంలోనూ గవర్నర్ ను వదల్లేదు!
చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అందరిచూపు ఇంచార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుపైనే ఉంది. ఆయన ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి కదలికను మీడియా ప్రముఖంగా చూపిస్తోంది. గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి చెన్నైకు ఆయన వచ్చారు.
విమానంలో కూడా మీడియా ప్రతినిధులు ఆయనను వదల్లేదు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని విమానంలో విద్యాసాగర్ రావును చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. అయితే విద్యాసాగర్ రావు మాత్రం నోరు మెదపలేదు. తమిళనాడు నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. చెన్నై విమానాశ్రయంలో దిగిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ తో భేటీ అయిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.