చెన్నై: అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామి ఈ సాయంత్రం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిశారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో ఆయన భేటీ అయ్యారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి నేరుగా రాజ్ భవన్ కు వచ్చారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పళనిస్వామి వెంట 12 మంది మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని ఇంతకుముందు గవర్నర్ ను కలిసి పన్నీర్ సెల్వం, శశికళ కోరిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో గవర్నర్ ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.