
హోదాతోనే ఉద్యోగాల విప్లవం
అందరం కలసి ప్రత్యేక హోదా సాధిద్దాం
విజయనగరం యువభేరిలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు
- ఐదుకోట్ల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
- ప్యాకేజీ, నిధులపై జైట్లీ, వెంకయ్య అబద్ధాలు
- రాష్ట్రానికి అదనంగా ఏం మేలుచేశారో చెప్పాలి
- ఎన్నికల ముందు ఓ మాట.. ఇప్పుడొక మాట
- ప్రత్యేక హోదా అడిగితే పీడీ కేసులా?
- హోదా అమ్మేసిన బాబుపై టాడా కేసు పెట్టవద్దా?
- యువభేరిలో నిప్పులుచెరిగిన ఏపీ ప్రతిపక్షనేత
విజయనగరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘చదువుల విప్లవం చూశాం.. కానీ నేడు మనకు కావాల్సింది ఉద్యోగాల విప్లవం.. ఆ విప్లవం ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది’ అని ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విజయనగరం శివారు నెల్లిమర్ల రోడ్డులోని జగన్నాథ్ ఫంక్షన్హాలు వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘యువభేరి’లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మనందరి జీవితాలు బాగు పడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే పీడీ కేసులు పెడుతున్నారని, అలాంటి చంద్రబాబు మీద టాడా కేసు ఎందుకు పెట్టకూడదని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
(విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదువుల విప్లవం చూశాం.. ఉద్యోగాల విప్లవం సాధిద్దాం..
‘‘మన జీవితాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా డిమాండ్ను ఒక విప్లవంలా, ఒక కెరటంలా ముందుకు కదిలించాలి. గతంలో నాన్నగారి హయాంలో చదువుల విప్లవం చూశాం. చదువుల కోసం, ఆస్పత్రుల కోసమే పేదవాళ్లు అప్పుల పాలవుతారు. అలా కాకుండా ఉండాలన్నా, వాళ్లు తమ జీవితాలు మార్చుకోవాలన్నా ఈ రెండు రంగాలకు భరోసా ఉండాలి అని దివంగత వైఎస్సార్ అనేవారు. ఆయన పాలన ఒక స్ఫూర్తి. అంతకుముందు ముఖ్య మంత్రులుగా పనిచేసినవాళ్లు ఎవరైనా పేదలు, బీసీల మీద ప్రేమను మాటలకే పరిమితం చేసేవారు. నాలుగు ఇస్త్రీపెట్టెలు, నాలుగు కులవృత్తుల పరికరాలు ఇచ్చి బీసీలకు మేలు చేశామని పబ్లిసిటీ చేసుకునేవారు.
పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్దచదువులు చదవాలని, అందుకు అప్పుల పాలు కాకూడదని రాజశేఖరరెడ్డి చదువుల విప్లవాన్ని తీసుకొ చ్చారు. ఆ విప్లవంతో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏం చదవాలన్నా పేదరికం అడ్డురాకుండా ఉండేది. ఇంజనీరింగ్కు లక్షన్నర అవుతుందన్నా.. తానున్నా చదివిస్తా అనేవారు. డాక్టర్ చదవాలంటే రెండున్నర లక్షలవుతుందన్నా చదివించారు. అప్పట్లో అలా భరోసా ఉండేది. ఆ చదువుల విప్లవం ఇప్పుడు తెరమరుగు అవుతోంది. పిల్లలను అలా చదివించాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రులకు లేకుండా పోయింది. అలాంటి చదువుల విప్లవాన్ని ఇప్పుడు దిగజార్చే శారు. ఇంజనీరింగ్ చదవాలంటే ఏడాదికి 70 వేల నుంచి లక్ష పాతికవేల వరకు అవుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేసినట్లు 35 వేలు ఫీజు రీయింబర్స్ చేసి మిగిలింది మీరే కట్టుకుని, అప్పుల పాలు కండి అంటోంది. రాజశేఖరరెడ్డి హయాంలో చదువుల విప్లవం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విప్లవం రావాలి. ప్రత్యేక హోదా వస్తేనే అది సాధ్యమౌతుంది.
కేసుల భయంతోనే ప్రజలకు బాబు వెన్నుపోటు
ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని ఈమధ్య చంద్రబాబు అడుగుతున్నారు. అప్పట్లో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాలని, అది కూడా ఐదేళ్లు ఇస్తే చాలదని.. పరిశ్రమలు కట్టడానికే రెండు మూడేళ్లు పడుతుందని, అది ప్రారంభమయ్యేలోపు హోదా అయిపోతే నష్టం జరుగుతుంది, కాబట్టి కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మోదీ సాక్షిగా చెప్పారు. వెంకయ్య నాయుడు కూడా కనీసం 10 సంవత్సరాలైనా కావాలని అడిగారు. వాళ్లు ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్లు ప్లేట్లు మార్చారు. వీళ్లను చూస్తే.. అసలు వీళ్లకు ప్రత్యేక హోదా మీద పూర్తి అవగాహన ఉందా అని అనుమానం వస్తుంది. అవగాహన ఉండి కూడా తమ స్వార్థం కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం ఇలా చేశారా అని అనుమానం వస్తుంది. చంద్రబాబు నల్లధనం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు గానీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికేశారు.
అంత జరిగినా ఆయన పదవికి రాజీనామా చేయకపోవడం, ఆయనను అరెస్టు చేయకపోవడం, పదవి నుంచి తొలగించకపోవడం బహుశా దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఇదే సీఎంగారికి ప్రత్యేక హోదా మీద అవగాహన ఉందా? అని ఒక్కోసారి అనిపిస్తుంది. అవగాహన ఉండి కూడా ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని అమ్మేశాడు. ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు చూస్తే దేన్నీ వదలలేదని అర్థమౌతుంది. రాజధాని భూములు, ఆలయాల భూములు వదల్లేదు. చివరకు అసైన్డ్ భూములు కూడా బలవంతంగా లాక్కున్నాడు. అవసరం లేకపోయినా ఎస్కలేషన్లు ఇప్పించి కాంట్రాక్టర్లు దండుకునేందుకు వీలు కల్పించారు. పట్టిసీమ నుంచి రాజధాని భూముల దాకా, బొగ్గు కొనుగోలు నుంచి ఇసుక దాకా, చివరకు డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు సర్వం అవినీతిమయం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన అవినీతిపై మోదీ గారు ఎక్కడ సీబీఐ ఎంక్వైరీ జరిపిస్తారోనన్న భయంతో ఐదున్నర కోట్ల మంది జనాభాకు వెన్నుపోటు పొడిచాడు.
చంద్రబాబు మీద టాడా యాక్టు పెట్టినా తప్పులేదు..
ప్రత్యేక హోదాను నీరుగార్చే వ్యవహారం గట్టిగా జరుగుతోంది. వాళ్ల స్వార్థం కోసం ఐదున్నర కోట్ల మంది ప్రజలను నడివీధిలో నిలబెడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ 29 రాష్ట్రాల్లోనంబర్ వన్ అవుతుందనడంలో నాకు అనుమానం లేదు. హోదా వల్ల మాత్రమే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది ఎవరూ నిరాకరించలేని సత్యం. ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయి. ఇలాంటి ప్రత్యేక హోదా మీద అబద్ధాలు చెబుతున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే, ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా పీడీ యాక్టులు పెడుతున్నారు. బంద్ పిలుపు ఇస్తే చంద్రబాబు స్వయంగా దగ్గరుండి బస్సులు తిప్పుతున్నారు. ప్రత్యేక హోదా అడిగితే మన మీద పీడీ యాక్టు పెట్టమంటున్న, ప్రత్యేక హోదాను అమ్మేసిన ఇలాంటి ముఖ్యమంత్రి మీద టాడా యాక్టు పెట్టినా తప్పుందా అని అడుగుతున్నా.
కలసికట్టుగా పోరాడి సాధిద్దాం..
ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతున్న ఈ వ్యక్తులను చూసినప్పుడు.. ‘మూర్ఖులు అబద్ధాలను నిజాలుగా చెప్పి వాదిస్తుంటే మేధావులు మౌనంగా ఉండటమే సమాజంలో అనేక అనర్థాలకు కారణం’అని బెర్ట్రండ్ రసెల్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నిజంగా అదే సమస్య. అందరం కలిసికట్టుగా గళం విప్పితే తప్ప హోదా సాధ్యమయ్యే విషయం కాదు. అందరం కలసికట్టుగా గట్టిగా నిలబడితే సాధ్యమౌతుంది. పక్కన అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి పార్లమెంటు సాక్షిగా మనకు మాట ఇచ్చినప్పుడు .. దాన్ని సాధించడానికి మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని, ఇందులో మీరంతా తోడుగా రావాలని కోరుతున్నా.’’ అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధిపై చంద్రబాబు అబద్ధాలు
నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు మనం బాగున్నామంటేనే అభివృద్ధి అంటారు. ప్రభుత్వం వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. మనం నిన్నటి కంటే నేడు బాగున్నామా.. నేటి కన్నా రేపు బాగుండే పరిస్థితి ఉందా అనేది ఆలోచించాలి. దేశంలో జీడీపీ వృద్ధిరేటు 7.20శాతం ఉంటే దాని కంటే 5% ఎక్కువగా 12.20% సాధించామని చెబుతున్నారు. జీడీపీ వృద్ధిరేటుకు మూడు కారకాలు చూస్తారు. వాటిలో మొదటిది వ్యవసాయ రంగం, రెండోది పారిశ్రామిక రంగం, మూడోది సేవారంగం.
ఈ మూడింటిలో పురోగతి ఉంటే దాన్ని గ్రోత్ రేట్ అంటారు. జాతీయ సగటు కంటే ఎక్కువగా రాష్ట్రంలో వృద్ధి ఉందని చంద్రబాబు అంటున్నారు. వ్యవసాయ రంగం ఎలా ఉందో, రైతుల పరిస్థితి ఏంటో చూద్దాం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ మూడేళ్లలో వరసగా కరువులు లేదా అతివృష్టి. వ్యవసాయం బ్రహ్మాండంగా పెరిగిందా?.. 130 కోట్ల దేశ జనాభాలో 65 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. చంద్రబాబు సీఎం అవ్వకముందు.. రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలన్నా చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఆయన సీఎం అయ్యేనాటికి రూ. 87,612 కోట్లుగా ఉన్న రైతు రుణాలు.. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు రూ. 1,00,709 కోట్లకు చేరింది. రుణాలు మాఫీ కాకపోగా.. అపరాధ వడ్డీలతో తడిసి మోపెడయ్యాయి. రబీ పంటకు 24 లక్షల హెక్టార్లలో విత్తనం వేయాల్సి ఉంటే కేవలం 9 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. బ్యాంకులు రూ. 34 వేల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 14% మాత్రమే ఇచ్చారు. రూ.24వేల కోట్ల రుణాలి వ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ. 10 వేల కోట్ల టెర్మ్ లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అందులో కేవలం 14 శాతం మాత్రమే రుణాలిచ్చారు.
విశాఖపట్నం యువభేరి అవ్వగానే మంత్రులు టీవీల ముందుకు వచ్చి వాళ్ల ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పారు. సోషియో ఎకనమిక్ సర్వే నిజాలు చెబుతుంది. దాని ప్రకారం చూస్తే 2014–15లో పెద్ద పరిశ్రమలకు రూ. 1,875 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 2,263 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం రూ. 4,138 కోట్లు వచ్చాయి. 2015–16లో పెద్ద పరిశ్రమలకు 3,969 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 1,592 కోట్లు. కానీ చంద్రబాబు మాత్రం విశాఖపట్నంలో రూ. 4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసేశామని డబ్బాలు కొట్టు కున్నారు. లేని జీడీపీ గ్రోత్రేటును చూపిస్తూ, కాస్తో కూస్తో వాళ్లు సానుభూతితో ప్రత్యేక హోదా ఇవ్వాలను కున్నా వాళ్లు వెనక్కుపోయే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చారు. ఇక సేవా రంగం.. విషయాన్ని చూద్దాం. చదువుకున్నవాళ్లంతా ఉద్యోగాల కోసం బయోడేటాలు పట్టుకుని తిరుగుతున్నారు ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయని అడుగుతున్నా. వచ్చింది పెద్ద సున్నా మాత్రమే. అయినా చంద్రబాబు మాత్రం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. అసలు లెక్కలు మూడేళ్ల తర్వాతే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం బొంకినా పర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారు.
వైఎస్ హయాం స్వర్ణయుగం ఎలా అయ్యిందంటే..
చంద్రబాబు మైండ్సెట్లోనే ఉన్న ఆయన మంత్రులకు ఎకనమిక్స్ తెలుసా లేదా అని అనుమానం వస్తుంది. రగ్నర్ నరక్స్ అనే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త పేదరికం గురించి మంచి సూత్రీకరణ చేశారు. పేద దేశాలు, రాష్ట్రాలు అలాగే ఉండటానికి కారణమేంటో వివరించారు. సమాజం గానీ, రాష్ట్రంగానీ, దేశం గానీ అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం పెట్టుబడులకు కావల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడం. దీన్ని ‘లో కేపిటల్ ఫార్మేషన్’ అంటారు. దీనివల్ల జరిగే నష్టం ఏమిటంటే.. ఆదాయాలు తగ్గుతాయి, దానివల్ల పొదుపు తగ్గుతుంది. పొదుపు తగ్గితే పెట్టుబడులకు డబ్బులు తగ్గుతాయి. పెట్టుబడులు తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం ఆదాయం మీద పడుతుంది. అలా ఇదంతా ఒక విషవలయం లాంటిది.
ఇది సరఫరా వైపు విషవలయం. ప్రజల కొనుగోలు శక్తి ప్రభుత్వాలు పెంచకపోతే అభివృద్ధి సాధ్యం కాదని రగ్నర్ చెప్పారు. ఆదాయం తక్కువగా ఉంటే వస్తువులు, సేవలను కొనలేరు కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. దాంతో పరిశ్రమలపై పెట్టుబడులు తగ్గి, ఉత్పత్తి తగ్గుతుంది.. చివరకు ఉద్యోగావకాశాలు తగ్గి మళ్లీ ఆదాయం తగ్గిపోతుందని, దాంతో ప్రజలు వస్తువులు, సేవలు వేటినీ కొనలేరని ఆయన సూత్రీకరించారు. ఇది డిమాండ్ వైపు విషవలయం. రాజశేఖరరెడ్డి గారు ఈ సూత్రాన్ని గ్రహించి చక్కగా అమలు పరిచారు. అందుకే ఆయన హయాంను సువర్ణయుగంగా చెప్పుకుంటున్నాం. ప్రజల వాస్తవ ఆదా యాలను పెంచగలిగారు. రైతులకు, సామాన్యులకు సంపాదించే మార్గాలను ఎక్కువ చేయగలిగారు. జలయజ్ఞం ద్వారా రైతులకు శాశ్వతంగా ఆదాయం ఉండేలా దారి చూపించారు. అప్పట్లో ధాన్యం కనీస మద్దతుధర రూ. 530 నుంచి రూ. 1030 కు పెరిగింది. రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం ఉచితంగా కరెంటు ఇచ్చారు. దాంతో రైతులు, ప్రజల ఆదాయస్థాయిని పెంచగలిగారు. ప్రజలు ఖర్చుపెట్టగల ఆదాయాన్ని కూడా పెంచారు. వాస్తవ ఆదాయాలను మాత్రమే కాదు ఖర్చుపెట్టగలిగిన ఆదాయాలను కూడా ఆయన పెంచగలిగారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఇది సాధ్యమైంది. దీంతో వాళ్లకు ఖర్చు తగ్గి, ఇతర అవసరాలకు ఖర్చుచేయగల ఆదాయం పెరిగింది. మిగిలిన దేశం మొత్తం 47 లక్షల ఇళ్లు కడితే ఒక్క సమైక్యాంధ్రప్రదేశ్లో 48 లక్షల ఇళ్లు కట్టించారు. జలయజ్ఞానికి ఐదేళ్లలోరూ. 48వేల కోట్లు ఖర్చుచేశారు. అందువల్ల సిమెంటు, స్టీలు, లేబర్, ట్రాన్స్పోర్టు డిమాండ్ పెరిగింది. ఇలా డిమాండ్ పెరగడం వల్ల, ప్రజల ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊపు వచ్చింది. వీటన్నిటివల్ల ఏపీలో ఐదేళ్లలో నమోదైన గ్రోత్ రేటు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ నమోదు కాలేదు. ఇలాంటి ఆర్థిక విషయాలు గానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా, ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవాలన్నా ప్రత్యేక హోదా అవసరం అన్న విషయం గానీ మన పాలకులకు అర్థం కాని పరిస్థితి.
అక్రమార్జనలో బాబు మూడంకెల గ్రోత్ రేట్
చంద్రబాబు పరిపాలన పుణ్యమాని రాష్ట్రంలో అంతా అరాచకం. గూండాయిజం, ఫ్యాక్షనిజం, అధికార వ్యవస్థల దుర్వినియోగం, అవినీతి, వ్యవస్థలను మేనేజ్ చేయడం, మీడియాను లొంగదీసుకోవడం, గ్రామ గ్రామాన దోపిడీ, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఆ ఎమ్మెల్యే స్థానాలలో ఉప ఎన్నికలు లేకుండా చూడటం, గ్రామాల్లో ఇసుక నుంచి ప్రతీదీ దోపిడీ చేయడం. వీటిలో మాత్రం చంద్రబాబు గ్రోత్ రేటు త్రిబుల్ డిజిట్ చూపించారు.
ఒక్క హోదాపై ఇన్ని అబద్ధాలా..?
వీళ్లు చెబుతున్న కొన్ని ముఖ్యమైన అబద్ధాలకు సమాధానం చెబుతా. అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు చేసిన ముఖ్యమైన అబద్ధాలు ఇవీ. ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా 25 సంస్థలు ఏపీకి ఇచ్చామని, నిధులు ఇచ్చామని జైట్లీ అన్నారు. ఒక రాష్ట్రానికి ఇంత సాయం చేయడం ఎక్కడా చూడలేదని వెంకయ్య అన్నారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర సాయంలో 90 శాతం కేంద్రం భరించడం తప్ప వేరే ఉపయోగం లేదని అన్నారు.
1. వీరు చెబుతున్న ఐఐటీలు, ఐఐఎంల లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఉండాలని గతంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. దేశంలో కోటి జనాభా దాటిన రాష్ట్రాలు 20 ఉన్నాయి. 22 ఐఐటీలు, 30 ఎన్ఐటీలు, 41 సెంట్రల్ యూనివర్సిటీలు, 19 ఐఐఎంలు, 19 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. కోటి జనాభా దాటిన అన్ని రాష్ట్రాలలోనూ ఇవి ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కు మీరు ప్రత్యేకంగా చేసిందేమిటి?. ఏ యాక్టులో ఉందని ఇటీవల గుజరాత్లో రైల్వే యూనివర్సిటీని ఇచ్చారు? ఏ యాక్టులో ఉందని హైదరాబాద్లో ఐఐటీసీ, సీసీఎంబీ, బీహెచ్ఈఎల్, హెచ్ఐఎల్, హెచ్ ఎం టి, మిథాని, బీడీఎల్, డీఎంఆర్ఎల్, డీఆర్డీఎల్, డీఆర్డీఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కట్టారు? గుజరాత్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పెట్రో రిఫైనరీని ఎలా పెట్టారు? చట్టంలో ఉన్నా మనకు చేయాల్సినవి చేయడం లేదు, రైల్వే జోన్ ఇవ్వడం లేదు. యాక్టులో ఉన్నా పోలవరం కట్టరు. యాక్టులో లేకపోయినా మిగిలిన వాళ్లకు చేస్తూ, యాక్టులో ఉన్నా మనకు చేయడం లేదంటే మనకు ప్రత్యేకంగా ఏం ఫేవర్ చేస్తున్నట్లు?
2. ప్యాకేజీ పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు. అడుగడుగునా అబద్ధాలే. ఈ మధ్యకాలంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రణాళికా శాఖ నుంచి ఒక సమాధానం వచ్చింది. 2016 సెప్టెంబర్ 8న ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని, దాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇచ్చామని, అందులో పేర్కొన్న అన్నింటినీ నెరవేర్చామని చెప్పారు. మనకు ఏ ప్యాకేజి రాకపోయినా, ఏ మేలు జరగకపోయినా ఆ పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు.
3. 12వ ఆర్థిక సంఘం రూ. 35 వేల కోట్లే ఇచ్చిందని, 13 వ ఆర్థిక సంఘం రూ. 69,298 కోట్లే ఇస్తే, కానీ 14వ ఆర్థిక సంఘంలో ఇప్పటికే 2,03,100 కోట్లు ఇచ్చిందని ఊదరగొట్టారు. ఇదేదో తమ ఘనతలా చెప్పుకుంటున్నారు. వీళ్లు అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక సంఘ నియామకం జరిగిపోయి.. రాష్ట్రాల అధ్యయనం కూడా పూర్తయింది. వీళ్లే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్కు అందే సాయం ఒక ఫార్ములా ప్రకారం వచ్చేదే. పేదరికానికి 50శాతం మార్కులు, జనాభాకు 27.5శాతం మార్కులు, విస్తీర్ణానికి 15శాతం మార్కులు, అడవులకు 7.5శాతం మార్కులు వేసి ప్రతిరాష్ట్రానికి నిధులు కేటాయిస్తారు. అందులో భాగంగానే ఐదేళ్లలో రూ. 1,69,969 కోట్లను మనకు (కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు) ఇస్తున్నారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 42 శాతం మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తారు. అందులో ఏపీ వాటా 4.31శాతం. మనకన్నాయూపీ, ఇతర రాష్ట్రాలకు ఎక్కువే ఇస్తున్నారు. రెవెన్యూ లోటును పూడ్చే గ్రాంటును కూడా అందరితోపాటు రూ. 22,113కోట్లు ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1.94 లక్షల కోట్లు ఇచ్చారు. మనతోపాటు పశ్చిమబెంగాల్, కేరళ సహా 11 రాష్ట్రాలకు ఇచ్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలకు అన్ని రాష్ట్రాల్లాగే మనకు ఐదేళ్లలో రూ.12వేల కోట్లు ఇచ్చారు. ఈ మూడు కలిపితే రూ. 2.3 లక్షల కోట్లు. మిగిలిన రాష్ట్రాలతో పాటు కలిపి ఇవ్వాల్సింది ఇచ్చారే తప్ప ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా అని చంద్రబాబు, జైట్లీ, వెంకయ్య నాయుడులను అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేనివాటి మధ్య వనరుల గ్యాప్ విషయంలో తేడా చూపలేదని మాత్రం అన్నారు.
4. 14వ ఆర్థిక సంఘం చెప్పబట్టే తాము ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రచారం చేశారు. కానీ ప్రత్యేక హోదా వద్దని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ లిఖితపూర్వకంగా చెప్పారు.
5. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల్లో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించడం తప్ప వేరే ప్రయోజనాలు ఉండవని అంటున్నారు. వంద శాతం ఆదాయపన్ను మినహాయింపు, వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు, వంద శాతం రవాణా సబ్సిడీ లాంటివి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎందుకు ఇచ్చారు.. వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. చివరకు ఉత్తరాంచల్ 2000లోనే ఏర్పడినా 2002లో ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు.