
బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్పై లైంగిక దాడి కేసు
సాక్షి, బెంగళూరు : చిక్కమగళూరు జిల్లా శృంగేరి నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు జీవరాజ్పై లైంగిక దాడి కేసు నమోదైంది. అయితే రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. వివరాలు... శృంగేరి నియోజకవర్గం పరిధిలోని కసకిమడబూరు గ్రామ శివారులోని ఓ తోటలో 2010 మేలో తనపై అప్పుడు మంత్రిగా ఉన్న జీవరాజ్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ యువతి ఎన్.ఆర్ పురం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసు అధికారులు జీవరాజ్పై ఐపీసీ 366, 354, 376, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై జీవరాజ్ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీకి చెందిన ఓ నేత మరదలే ఆ యువతి అని, తనకు భారీ మొత్తం డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తోందని చెప్పారు. లేదంటే లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు పెట్టి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని తాను పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు.
ఈ ఏడాది ఆగస్ట్ 20న విధానసౌధ పోలీస్స్టేషన్లో ఆమెపై బ్లాక్మెయిల్ కేసు కూడా నమోదు చేశారన్నారు. ఇటీవల ఆమె నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాని ధీమా వ్యక్తం చేశారు.