
తమిళంలో సెల్వందన్గా శ్రీమంతుడు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు తాజాగా తన చిత్రాల ప్రణాళికలో కొత్త పంథాను అనుసరిస్తున్నారు. నటుడిగా తన స్టామినాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్లో సూపర్స్టార్గా వెలుగొందుతున్న మహేశ్కు కోలీవుడ్లో ఇప్పటివరకూ అనువాద చిత్రాలతో పరిచయం అయ్యారు.అయినా ఆయన చిత్రాలకు ఇక్కడ మంచి ఆదరణే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేరు చిత్రాల కథానాయకుడిగా ప్రాచుర్యం పొందే ప్రయత్నం చేస్తున్నారు. నటుడు ప్రభాస్ నటించిన బాహుబలి తెలుగు,తమిళం భాషల్లో తెరకెక్కి హిందీలోకి అనువాదమై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా మహేశ్బాబు బ్రహ్మోత్సవం అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇదటుంచితే అంతకు ముందుగా ఆయన నటించిన తాజా తెలుగు చిత్రం శ్రీమంతుడు ఏకకాలంలో సెల్వందన్ పేరుతో తమిళంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
శ్రుతిహాసన్ కథానాయికిగా నటి ంచిన ఈ చిత్రంలో జగపతిబాబు, సుకన్య, మాస్కోవిన్కావేరి చిత్రం ఫేమ్ రాహుల్ రవీంద్రన్, సనమ్ శెట్టి, నికిత అనిల్, సంపత్, రాజేంద్రప్రసాద్, సితార, తులసి, ముఖేష్రిషి, సనా ముఖ్యపాత్రలు ధరించారు. మిర్చి అనే సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ తాజాగా రూపొందించిన చిత్రం శ్రీమంతుడు. దీన్ని తమిళంలోకి సెల్వందన్ పేరుతో మైత్రిమూవీ మేకర్స్, ఎంబీఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటె డ్ సంస్థల సమర్పణలో భద్రకాళీ ఫిలింస్ సంస్థ అనువదిస్తోంది. అడ్డాల వెంకట్రావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 7న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునట్లు శుక్రవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ వెల్లడించారు.
బాహుబలి చిత్రం కోసమని సుమారు నెల రోజుల పాటు విడుదలను వాయిదా వేయడానికి అంగీకరించిన చిత్ర హీరో మహేశ్బాబుకు ఈ సమావేశంలో అభినందనలు తెలిపారు. సమాజంలో శ్రీమంతులు చాలా మంది ఉంటారు. మరి ఈ చిత్రంలో శ్రీమంతుడు ఏంచేశాడన్నదే చిత్ర కాన్సెప్ట్ అని అన్నారు. ఈ చిత్రంలో మహేశ్బాబు ఉపయోగించే సైకిల్ తయారీకి *3.75 లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. తెలుగులో ఇటీవల విడుదలైన చిత్ర ఆడియో మంచి హిట్ అయ్యిందని తమిళంలోనూ త్వరలోనే మహేశ్బాబు, శ్రుతిహాసన్, దర్శకుడు కొరటాల శివ తదితర ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్మాత భద్రకాళీ ప్రసాద్ వెల్లడించారు.