కారులోంచి వెయ్యినోట్లు విసురుకుంటూ...
Published Sat, Nov 12 2016 9:14 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
ద్వారకా తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి వింతచర్య
తీసుకొనేందుకు పరుగులు పెట్టిన జనం
ద్వారకాతిరుమల: పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చి పోయే యాత్రికుల సందడి నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారిలో కొందరు అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు.
Advertisement
Advertisement