
అనాథలున్నారు...చందాలివ్వండి!
‘అనాథ పిల్లలను ఆదరిస్తున్నామ’ంటూ ‘సేవ’ ముసుగులో కొన్ని స్వచ్ఛం ద సంస్థలు ప్రజలను మోసగిస్తున్నాయి. దాతలు ఇస్తున్న విరాళాలను పక్కదోవ పట్టిస్తున్నాయి.
- అనాథల పేరుతో ‘గివ్ లైఫ్ ట్రస్టు’ వ్యాపారం
- దాతల నుంచి విరాళాల సేకరణ
- స్థానిక పిల్లలనే అనాథలుగా చిత్రీకరణ
సాక్షి, సిటీబ్యూరో: ‘అనాథ పిల్లలను ఆదరిస్తున్నామ’ంటూ ‘సేవ’ ముసుగులో కొన్ని స్వచ్ఛం ద సంస్థలు ప్రజలను మోసగిస్తున్నాయి. దాతలు ఇస్తున్న విరాళాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఈ కోవకు చెందినదే చందానగర్లోని పాపిరెడ్డి కాలనీలో గల ‘గివ్ లైఫ్ ట్రస్టు’. అనాథ పిల్లల సేవ పేరిట రూ.లక్షల్లో దోచుకుంటోందంటూ ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాల్ సెంటర్ నుంచే విజ్ఞప్తులు
అమీర్పేటలోని సారథి స్టూడియో పక్క గల్లీలోని శ్రీసాయి రెసిడెన్సీలో ‘గివ్ లైఫ్ ట్రస్టు’కు చెందిన కాల్సెంటర్ నడుస్తోం ది. ఇందులో 22 మంది సిబ్బంది ఉన్నా రు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా వీరు ప్రజలకు ఫోన్లు చేస్తుంటారు. ‘మేము అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాం. మా వద్ద 30 మంది పిల్లలు ఉన్నారు. సార్ మీరు ఏమైనా సాయం చేయండి’ అంటూ కాల్సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. ఆశ్రమం ఎక్కడని అడిగితే చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాపిరెడ్డి కాలనీలోనని చెబుతారు. దాతలు వస్తే..స్థానికంగా ఉండే నిరుపేదల పిల్లలను పోగుచేసి అనాథలుగా చూపించి, సాయం పొందుతున్నారు. ఈ డబ్బును నిర్వాహకులు పక్కదారి పట్టిస్తున్నారనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక్కడే ఎందుకంటే...
పాపిరెడ్డి కాలనీలో నిరుపేద కుటుంబా లు ఎక్కువ. ఇది గ్రహించిన గివ్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చుట్టుపక్కల కుటుంబాల పిల్లలను తమ వద్దకు పంపితే ఉచితంగా భోజనం పెడతామని ప్రచారం చేశారు. వారి తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు తమ వద్ద అనాథలు ఉన్నారని ప్రచారం చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇది గుర్తించిన అడిగిన పిల్లల తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగుతున్నారు.
శని, ఆదివారాల్లో సందడి..
‘గివ్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్’ నుంచి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఫోన్లు వెళుతుంటాయి. శని, ఆదివారాలు సెల వు ఉండటంతో ఆ రోజుల్లో వారు అనాథశ్రమానికి వెళుతుంటారు. కొంత మంది తమ పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు, మరికొంత మంది అనాథ పిల్లలతో సరదాగా గడిపేందుకు వెళుతుంటా రు. వీళ్లను నమ్మించి సంస్థ సభ్యులు విరాళాలు సేకరిస్తుంటారు. అలా వీరికి ఏటా రూ.లక్షల్లో అందుతున్నాయి. వీరి ఫోన్ కాల్స్ను నమ్మిన అనేక మంది ఉద్యోగులు నేరుగా సంస్థ ఖాతాలోకి భారీగానే డబ్బు వేశారని తెలుస్తోంది. సంస్థ చూపుతున్న 30 మంది పిల్లల్లో ఐదుగురు మాత్రమే అనాథలని, మిగతా పిల్లలు చుట్టుపక్కల వారేనని స్థానికులుచెబుతున్నారు.
తక్కువ ధరకే అమ్మకం
దాతలు విరాళాలుగా ఇచ్చిన 25 కేజీల బియ్యాన్ని రూ.700కు, ఇతర సరుకులను తక్కువ ధరకు అమ్ముతున్నారని సమీపంలోని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ అనాథాశ్రమం అక్రమమా.. సక్రమమా అని తేల్చాల్సి ఉంది. ఈ విషయంపై సంస్థ ప్రతినిథులతో మాట్లాడేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్లో సంప్రదించగా, స్పందన కరువైంది.