ఇంటింటా మరుగుదొడ్డి | As a pilot project,Penckalpad selected | Sakshi

ఇంటింటా మరుగుదొడ్డి

Feb 10 2015 4:51 AM | Updated on Sep 5 2018 8:24 PM

గృహనిర్మాణ, ఉపాధిహామీ పథకం, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

- పైలట్ ప్రాజెక్ట్‌గా పెంచ్‌కల్‌పాడ్ ఎంపిక
- తిమ్మాపూర్‌కు తరలిన లబ్ధిదారులు
- ముఖ్యమంత్రి సభకు ఆహ్వానం
కుంటాల : గృహనిర్మాణ, ఉపాధిహామీ పథకం, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డీఆర్‌డీఏ, ఐకేపీ శాఖల ద్వారా సంయుక్తంగా మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ గ్రామాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. గ్రామంలో మరుగుదొడ్లు వందశాతం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపటే ్టందుకు ముందుకు వచ్చారు.
 
వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం..
మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ గ్రామంలో 340 కుటుంబాలుండగా వెయ్యి మంది జనాభా ఉన్నారు. నాలుగు రోజులుగా గ్రామంలో చేపట్టిన సర్వేలో 137 ఇళ్లలో మరుగుదొడ్లు లేవని తెలిసింది. వివిధ కారణాలతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 74ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. గ్రామంలో మరుగుదొడ్ల లక్ష్యం వందశాతం పూర్తి చేసేందుకు డీఆర్‌డీఏ, ఐకేపీ శాఖలు ముందుకు వచ్చాయి. మరుగుదొడ్ల నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆ శాఖల ద్వారా రూ.12వేలు నేరుగా వీవో సంఘాల ద్వారా అధికారులు అందించి ప్రోత్సహిస్తున్నారు.
 
అధ్యయనం కోసం తిమ్మాపూర్‌కు..
మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ ముంపు గ్రామం. గ్రామంలో ప్రతీ ఇంటి ఎదుట విశాలమైన స్థలం ఉంది. నిబంధనలు సడలిస్తే నిర్మాణాలు పూర్తిచేస్తామని లబ్ధిదారులు పేర్కొనడంతో అధికారులు జిల్లాలోని పెంచ్‌కల్‌పాడ్‌ను నమూనా ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. దీంతో ఐకేపీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి సర్పంచ్ దాసరి కమల, ఎంపీటీసీ సభ్యురాలు అవదూత్‌వార్ వేదిక, మహిళాసంఘాల సభ్యులు, గ్రామపెద్దలు, అధికారులు, అధ్యయనం కోసం మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లారు.

తిమ్మాపూర్ గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి అక్కడి గ్రామస్తులు రాష్ర్టంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్కడ చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను పెంచ్‌కల్‌పాడ్ గ్రామస్తులు మూడురోజుల పాటు అధ్యయనం చేస్తారు. కాగా మెదక్ జిల్లా కౌడపెల్లి మండల కేంద్రంలో ఈనెల ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభకు గ్రామ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులకు ఆహ్వానం అందింది. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement