
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై కేంద్రం దృష్టి సారించింది. ప్రైవేటు పాఠశాలల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ జాతీయ బాలల హక్కుల, పరిరక్షణ కమిషన్కు (ఎన్సీపీసీఆర్) ఫిర్యాదులు వస్తున్న నేçపథ్యంలో ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది.
అనేక పాఠశాలలు వివిధ ఆకర్షణీయ పేర్లతో భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయని తమకు వచ్చిన ఫిర్యాదులతో కూడిన వివరాలను ఇటీవల ఎన్సీపీసీఆర్ మానవ వనరుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్ఆర్డీ) అందజేసింది. దీంతో పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న అంశాలపై తమకు సమగ్ర నివేదిక అందజేయాలని ఎన్సీపీసీఆర్కు సూచించింది. ఆ నివేదిక ఎంహెచ్ఆర్డీకి అందగానే మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాల్లో నిబంధనలను రూపొందిం చి, అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది.