తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అప్పగించారు. టీడీఎల్పీ నేతను, ఇతర సభ్యులను బాబు శనివారం ప్రకటిస్తారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అప్పగించారు. టీడీఎల్పీ నేతను, ఇతర సభ్యులను బాబు శనివారం ప్రకటిస్తారు. ఈ విషయమై శుక్రవారం రాత్రి బాబు నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావుకు అవకాశం ఇవ్వాలని బాబు భావించినా బీసీ నినాదంతో తెలంగాణలో ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో అసెంబ్లీ లో పార్టీకి సారథ్యం వహించే బాధ్యతను బీసీ నాయకుడికే అప్పగించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
దాంతో ఆ వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్యాదవ్ పేరు చర్చకు వచ్చినట్టు సమాచారం. బీసీ ముఖ్యమంత్రిగా ఆర్.కృష్ణయ్య పేరును ప్రచారంలోకి తీసుకొచ్చినా అధికార టీఆర్ఎస్ బలంగా ఉండడంతో ఆ పార్టీని ఎదుర్కోగల బీసీ నేతను ఎంపిక చేస్తేనే మేలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు తలసాని వైపు మొగ్గారంటున్నారు. మొదటి నుంచీ టీఆర్ఎస్ను, కేసీఆర్ను వ్యతిరేకించే నేతగా తలసాని ముద్రపడిన నేపథ్యంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినందున నగర నేత అయిన ఆయనకే టీడీఎల్పీ బాధ్యతలివ్వాలని అత్యధికులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇతర సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా బీసీకి టీడీఎల్పీ పదవి ఇవ్వదలిస్తే తలసానికే ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. ఎర్రబెల్లికి ఇస్తే ఉత్తర తెలంగాణలో టీడీపీకి పునరుత్తేజం వస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమైనా సామాజిక వర్గం ఆయనకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఆయన కూడా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడతానని చెప్పారంటున్నారు.