‘కమీషన్‌’ కేటుగాళ్లు అరెస్ట్‌! | commissions cheater srinivasa reddy arrested | Sakshi
Sakshi News home page

‘కమీషన్‌’ కేటుగాళ్లు అరెస్ట్‌!

Published Sun, Aug 19 2018 1:37 AM | Last Updated on Sun, Aug 19 2018 3:49 AM

commissions cheater srinivasa reddy arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీరు ఘరానా మోసగాళ్లు.. ఇతరుల భూములపై నకిలీ పత్రాలు సృష్టించారు.. వీటిని కొన్ని కంపెనీలకు కొలట్రల్‌ సెక్యూరిటీగా పెట్టారు.. భారీ మొత్తం రుణంగా ఇప్పించి నిర్ణీత శాతం కమీషన్‌ తీసుకున్నారు.. ఈ పంథాలో బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థ లను మోసం చేసి రూ.100 కోట్ల రుణాలు ఇప్పించి, భారీగా కమీషన్లు తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డి సహా పది మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరో 40 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిపై హైదరాబాద్, రాచకొండతోపాటు ఏపీ లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో కలసి కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ శనివారం మీడియాకు వెల్లడించారు.  

నకిలీ పత్రాలు సృష్టించి..
గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి నగరంలోని ఎస్సార్‌నగర్‌లో ఉంటున్నాడు. తొలుత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న అతను ఆ వ్యాపా రాన్ని పక్కకు పెట్టి మోసాలు చేయడం ప్రారంభించా డు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని స్థలా ల్లో ఉన్న సాంకేతిక అంశాలు, చిన్న చిన్న లోపాలను గుర్తించే శ్రీనివాస్‌రెడ్డి వాటి పాత యజమానులను మభ్యపెట్టి, నకిలీ పత్రాలు సృష్టించి సదరు స్థలం తన పేరుతో ఉన్నట్లు డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రుణాలు తీసుకునే కంపెనీలకు అవసరమైన కొలట్రల్‌ సెక్యూరిటీలు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటాడు. ఆసక్తి చూపిన వారితో కమీషన్‌పై ఒప్పందం చేసుకునేవాడు.  

వెలుగులోకి వచ్చింది ఇలా...
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ స్థలానికి సంబంధించి నకిలీపత్రాలను సృష్టించిన శ్రీనివాస్‌రెడ్డి ఇస్నాపూర్‌ ఎస్‌బీ హెచ్‌లో కొలట్రల్‌ సెక్యూరిటీగా పెట్టి ఓ సంస్థకు రూ.18 కోట్ల రుణం ఇప్పించాడు. ఈ మేరకు రూ.66 లక్షల కమీషన్‌ తీసుకున్నాడు. అదే స్థలంపై, మరో సెట్టు పత్రాలను ఇంకో సంస్థకు కొలట్రల్‌ సెక్యూరిటీగా పెట్టడానికి సిద్ధమై రామంతాపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ లో దాఖలు చేశాడు. ఈ 2 బ్యాంకులకు లీగల్‌ ఒపీయన్‌ ఇచ్చే అధీకృత సలహాదారు ఒక్కరే.

అతను ఈ విష యాన్ని గుర్తించి ఎస్‌బీహెచ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రూ.18 కోట్ల రుణం పొందిన సంస్థ ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకోవడంతోపాటు దానిని నాన్‌పెర్ఫామింగ్‌ అసెర్ట్‌గా ప్రకటించింది. నష్టపోయిన ఆ సంస్థ యజమాని కొలట్రల్‌ సెక్యూరిటీగా పెట్టిన స్థలం పై ఆరా తీయడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన వారికి విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరెడ్డి, గోపాలకృష్ణ, వినోద్‌ కుమా ర్, మహమ్మద్‌ షఫీ, విశ్వనా థమ్, జగన్‌రావు, పిల్లి ఐలయ్య, వెంకటరామ్‌రెడ్డి, గంగరామ్, వేముల అశోక్‌లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

సిబ్బంది తప్పిదంతోనే
భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ సమయంలో యజమానులు హాజరుకావడంతోపాటు వారి గుర్తింపుకార్డులు, ఈసీ, టైటిల్‌ డీడ్‌లు, లింక్‌ డాక్యుమెంట్లు తనిఖీ, యజమాన్య హక్కులు తనిఖీ చేయాల్సి ఉండగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీ సు(ఎస్‌ఆర్‌వో)ల్లో అటువంటిదేమీ చేయలేదు. బ్యాం కర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయకుండానే రుణాలు ఇచ్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈసీ లో నిక్షిప్తమైన సమాచారాన్ని తొలగించాలంటూ ఎస్‌ఆర్‌వోలకు పోలీసులు లేఖ రాయనున్నారు. కొలట్రల్‌ మోసాలపై తనిఖీ చేసి విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన బ్యాంక్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తామని మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement