
టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య: అనూహ్య మలుపు!
వరంగల్: టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్ (45) దారుణ హత్య కేసు దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. మురళి హత్యకేసులో పలువురు కాంగ్రెస్ నేతల ప్రమేయమున్నట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, ఏ-5 పోతుల శ్రీమాన్, ఏ-6గా కానుగంటి శేఖర్ పేర్లను పోలీసులు చేర్చారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అయిన మురళి గత గురువారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయనను సాయంత్రం 6:30 సమయంలో సొంత ఇంట్లోనే ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం హత్యాయుధాలను దారి పొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే..
రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తమ పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్రెడ్డి, శ్రీమాన్, శేఖర్ తెలిపారు. మురళి తమకు మంచి స్నేహితుడని, మురళి హత్యను తమను కలిచివేసిందని చెప్పారు. ఆధారాల్లేకుండా ఎఫ్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేయడం బాధాకరమని వారు తెలిపారు.