
సాక్షి, సిద్దిపేట: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)పై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపే పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 14 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మరో నెలలో గురుకుల టీచర్లకు సంబంధించిన 6 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
గురుకుల టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి నెలలో నియామక జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రూపు–2 పోస్టులకు సంబంధించిన కోర్టు కేసు త్వరలో క్లియర్ అవుతుందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల పోస్టులకు, గ్రూప్–4, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చైర్మన్ వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 31 వేల పోస్టుల భర్తీ బాధ్యత తమపై పెట్టిందని, నియామకాలను పారదర్శకంగా చేపట్టడం వల్లే జాప్యం జరుగుతోం దని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం దృ ష్ట్యా పోస్టులు భర్తీ చేస్తున్నామని చక్రపాణి పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ కన్నా తెలంగాణలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎక్కువ పోస్టులు భర్తీ అయ్యాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment