
సాక్షి, ములుగు: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ మేడారం జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పాల్గొన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఘనంగా స్వాగతం పలికారు. (జాతర షురూ: కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ)
దర్శనం అనంతరం గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో జరిగే మేడారం జాతర దేశంలోనే అతిపెద్దదని కొనియాడారు. వనదేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేడారాన్ని దేవభూమిగా భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్ హోదాలో అమ్మవార్ల ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. (చదవండి: గద్దెనెక్కిన వరాల తల్లి)