
సాక్షి, హైదరాబాద్ : ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించొద్దని రైతు సమితి సభ్యులకు సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో కలసి పనిచేయాలని చెప్పారు. సోమవారం వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సమితి కార్పొరేషన్ చైర్మన్గా గుత్తా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందేలా సమితి సభ్యులు కృషి చేయాలని చెప్పారు. సభ్యులకు జీతభత్యాలు లేవని, రైతులకు సేవ చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రాష్ట్రంలో 5 వేల వరి నాటు యంత్రాలు ఇస్తామని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, క్షీర విప్లవాలు అమలవుతాయని, వీటి వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపవుతుందని పేర్కొన్నారు.
రైతులకు రుణమాఫీ చేశామని, పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించనున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఈ పనంతా రైతు సమన్వయ సమితులు చేయనున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment