gutta sukhender reddy
-
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్పోర్టు వీఐపీ లాంజ్లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
బీఆర్ఎస్పై అసంతృప్తి లేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధిష్టానంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి వదంతులు మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీకి తాను గతంలో ఎంత దూరంలో ఉన్నానో ఇప్పుడు కూడా అంతే దూరం పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనమండలిలోని చైర్మన్ ఛాంబర్లో గుత్తా మంగళవారం మీడియాతో ఇష్టాగో ష్టిగా మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డితో సహా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. తనకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉందని, ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ కేడర్ను కాపాడి పార్టీకి అండగా నిలబడేందుకు తన కుమారుడు గుత్తా అమిత్రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సుఖేందర్రెడ్డి వెల్లడించారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కడ అవకాశమిచ్చినా తన కుమారుడు పోటీ చేస్తాడని, అతనిది అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అని పేర్కొన్నారు. తన కుమారుడికి పార్టీ టికెట్ అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని గుత్తా వెల్లడించారు. నల్లగొండ, భువనగిరిలో బీసీలకు అవకాశ మిచ్చినా గెలుపు కోసం సహకరిస్తామన్నారు. నల్ల గొండ నుంచి సోనియా గాంధీ పోటీ చేసినా ఆమె పై పోటీకి తన కుమారుడు అమిత్ సిద్ధంగా ఉన్నా డని చెప్పారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారే ప్రసక్తే లేదని గుత్తా స్పష్టం చేశారు. ఫిర్యాదులు ప్రివిలేజ్ కమిటీకి.. ముఖ్యమంత్రిపై సభ్యులు చేస్తున్న ఫిర్యాదులను ప్రివిలేజీ కమిటీకి పంపిస్తానని గుత్తా వెల్లడించారు. కేటీఆర్ తన నివాసానికి రావడం సాధారణ రాజకీ య ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే శాసన మండలి సమావేశా లను పాత భవనంలో జరిపేందుకు ఏర్పాట్లు జరు గుతున్నాయన్నారు. కమ్యూనిస్టుల ఓట్ల శాతం తగ్గి నా ఎంతో కొంత బలం ఉందన్నారు. -
ఎమ్మెల్సీలను బ్రోకర్లని అంటారా!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిని ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరి స్తూ ఓ చానల్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై కఠినచర్యలు తీసుకో వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎం వ్యాఖ్యలు మొత్తం శాసనమండలి సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టీవీ చానల్ వేదికగా పెద్దల సభపై సీఎం మాట్లాడిన తీరు ఎథిక్స్ కమిటీ పరిశీలించాల్సిన రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. గౌరవ సభ్యులను బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బ్రోకర్లు, ల్యాండ్ డీలర్లుగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. శాసన మండలిలో అనేక మంది నిజాయితీ కలిగిన సభ్యులతో పాటు వివిధ రంగాల్లో సేవలకు తమ జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని పేర్కొ న్నారు. సీఎం వాడిన భాషకు ఎంతో వేదనకు గుర య్యామని, ఎథిక్స్ కమిటీ పరిశీలనకు సీఎం వ్యా ఖ్యలను పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేసీఆర్తో మండలి చైర్మన్ గుత్తా భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం మాజీ సీఎం కేసీఆర్తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమారుడు గుత్తా అమిత్రెడ్డితో పాటు ఫామ్హౌస్కి వెళ్లిన సుఖేందర్రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్తో చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు కూడా మంగళవారం ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే విజయుడికి కేసీఆర్ ఆశీస్సులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి కూడా ఉన్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే అబ్రహాంను అలంపూర్ అభ్యరి్థగా ప్రకటించి చివరి నిమిషంలో కేసీఆర్ విజయుడికి బీ ఫారాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ చల్లాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న విజయుడు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని విజేతగా నిలిచారు. -
అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో చట్ట సభల తరహాలోనే శాసనసభ కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం కమిటీ ప్రధాన విధి అని స్పీకర్ పేర్కొన్నారు. బుధ వారం అసెంబ్లీ ఆవరణలో 2019–20 సంవత్సరపు ప్రభు త్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) తొలి సమావేశం కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల పనితీరుకు సంబంధించిన నివేదికలు, లెక్కలను భారత కంపోŠట్రలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను కమిటీ పరిశీ లిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉంటుందని శాసన మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, అకౌంట్స్ విషయంలో అకౌంటెంట్ జనరల్ ఇచ్చే నివేదికల్లో లోటుపాట్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. సమావేశంలో సభ్యులు విద్యాసాగర్రావు, ప్రకాశ్గౌడ్, అబ్రహం, శంకర్నాయక్, దామోదర్రెడ్డి, భాస్కర్రావు, పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్, నారదాసు లక్ష్మణ్రావు, పురాణం సతీష్ పాల్గొన్నారు. హామీల అమలు బాధ్యత ఆ కమిటీదే.. శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే సందర్భంలో సీఎం, మంత్రులిచ్చే హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత హామీల అమలు కమిటీపై ఉంటుందని మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో హామీల అమలు కమిటీ చైర్మన్ గంగాధర్గౌడ్ అధ్యక్షతన జరిగిన 2019–20 హామీల అమలు కమిటీ తొలి సమావేశంలో గుత్తా పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా సుఖేందర్రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి మండలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. సోమవారం మండలి ఆవరణలోని చైర్మన్ చాంబర్లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్రావు, కిషోర్, మల్లయ్య యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు హాజరయ్యారు. అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద భాస్కర్రావు, గొంగిడి సునీతతో కలసి గుత్తా విలేకరులతో మాట్లాడారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం సద్వినియోగం చేస్తానని, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన మండలి ఎమ్మెల్యే కోటా ఉపఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన 2021 జూన్ 3వ తేదీ వరకు పదవిలో కొనసాగుతారు. -
కేసీఆర్, కేటీఆర్లకు గుత్తా ధన్యవాదాలు
సాక్షి, నల్గొండః ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు గుత్తా సుఖేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలమంతా పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వం అనుకున్న లక్ష్యం కన్నా అధికంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుందన్నారు. బీజేపీ.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనుకోవడం హాస్యాస్పదమని.. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదని.. ఆ తర్వాత అన్ని ఎన్నికలలో అడ్రెస్ లేకుండా పోయిందన్నారు. 7, 10వ తేదీల్లో నామినేషన్ వేస్తామన్నారు. -
గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుసమన్వయ సమితి పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం శనివారం ఆమోదించింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేయడంతో రైతుసమన్వయ సమితి పదవిని వదులుకున్నారు. గుత్తా అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో టీఆర్ఎస్ గూటికి చేరారు. 2014 సార్వత్రిక ఎ న్నికల్లో, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. అందులో నల్లగొండ ఒకటి. టీఆర్ఎస్ గాలిని తట్టుకుని కాంగ్రెస్నుంచి విజయం సాధించిన ఆయన రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్ఎస్ చేపట్టి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా గులాబీ పార్టీకి చేరువయ్యారు. -
విత్తన ఎగుమతికి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు నాణ్యమైన విత్తనాల ఎగుమతికి విస్తృత అవకాశాలున్నాయని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని నోవాటెల్లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ వర్క్షాప్ను.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలసి ప్రారంభించారు. విత్తన ఎగుమతులతో రాష్ట్ర రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పోచారం వెల్లడించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా విత్తన ఎగుమతులు, మార్కెటింగ్కు అన్ని దేశాలు అంగీకరించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధిక విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం ఉందన్నారు. దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేసే చాన్స్: పార్థసారథి వివిధ దేశాల సాగు పరిస్థితులు, పంటల తీరును ఆకళింపు చేసుకుని విత్తనోత్పత్తి చేయాలని.. భారత్, ఆఫ్రికా, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఒకే రకమైన పంటలు సాగులో ఉన్న విషయాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రస్తావించారు. ఆయా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు మంచి మార్కెట్ ఉందని, ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్ కేవలం 4.4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందన్నారు. ఈ వాటాను పది శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గత రెండేళ్లలో ఓఈసీడీ ద్వారా విత్తన ధ్రువీకరణ పొంది, ఎగుమతులు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు రాష్ట్రం నుంచి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలైన మయన్మార్, థాయ్లాండ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశా ల్లో సాగయ్యే పత్తి విత్తనాలు.. తెలంగాణ నుంచి ఎగుమతి చేసే వీలుందని పార్థసారథి తెలిపారు. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 7 శాతం కాగా, భారత్లో ఇది 17 శాతంగా ఉందని.. 2027 నాటికి జనాభా పెరుగుదలతో చైనాను భారత్ మించుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కోసం విత్తనోత్పత్తి పెరగాల్సిన అవసరముందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఇస్టా అధ్యక్షుడు క్రెయిగ్ మాక్గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి చికెలు బా, ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి 35 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు’
సాక్షి, నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత కూడా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. శుక్రవారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించకుంటే ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత టీపీసీసీ సీనియర్ నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించినవారేనని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత -
రైతు భీమా పక్రియకు సహకరించాలి: గుత్తా
సాక్షి, నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా రైతు భీమా పక్రియ విజయవంతంగా కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 21 లక్షల మంది రైతులను కలిసి నామిని వివరాలు, సంతకాలు సేకరించామని చెప్పారు. జులై చివరి నాటికి భీమా పత్రాలను ఎల్ఐసీకి సమర్పించాలి.. కావునా రైతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు అర్ధరహిత ఆరోపణలు మానుకొని రైతు భీమా పక్రియలో పాల్గొంటే రైతులకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో కేంద్రం కూడా రైతుల జపం చేస్తోందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పట్టారని, తెలంగాణలో అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పిడుగుపాటుకు మరణించిన రైతులకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. -
రైతు కార్పొరేషన్ చైర్మన్గా గుత్తా
సాక్షి, హైదరాబాద్ : ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించొద్దని రైతు సమితి సభ్యులకు సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో కలసి పనిచేయాలని చెప్పారు. సోమవారం వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సమితి కార్పొరేషన్ చైర్మన్గా గుత్తా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందేలా సమితి సభ్యులు కృషి చేయాలని చెప్పారు. సభ్యులకు జీతభత్యాలు లేవని, రైతులకు సేవ చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రాష్ట్రంలో 5 వేల వరి నాటు యంత్రాలు ఇస్తామని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, క్షీర విప్లవాలు అమలవుతాయని, వీటి వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని, పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించనున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఈ పనంతా రైతు సమన్వయ సమితులు చేయనున్నాయని వివరించారు. -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
చందంపేట (దేవరకొండ) : రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పోలేపల్లి, చందంపేట, గుంటిపల్లి, ముడుదండ్ల గ్రామాల పరిధిలోని చెరువుల వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గుత్తా మాట్లాడుతూ 70 ఏళ్లుగా పూడికతో నిండిన కాల్వలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాల్వల ద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లోని చెరువులు జలకళను సంతరించుకోవడంతో రైతన్నలకు సాగు నీటికి డోకా లేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి డిండి రిజర్వాయర్ ద్వారా చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని సుమారు 12 చెరువులను నింపనున్నట్లు తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాల్వల ద్వారా చెరువులకు నీరు చేరుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోందని అన్నారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేలు చెరువుల వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ వేణుధర్రెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, శ్రీనివాస్గౌడ్, డీఈ రూప్లానాయక్, శిరందాసు కష్ణయ్య, సర్పంచ్ అన్నెపాక ధనమ్మ, మల్లారెడ్డి, అనంతగిరి, మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. -
ఆ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో ...అందులోని బలమైన నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకువడం ద్వారా సుస్థిరమైన ప్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా రెండురోజుల క్రితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారని తనదైన శైలిలో విరుచుకుపడిన విషయం విదితమే. అయితే తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామని అన్నారు. -
'మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం'
సాక్షి, నల్గొండ: పార్టీ మారుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఖండించారు. తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటు పడతానన్నారు. మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని వివరించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి వచ్చిన మెజార్టీ పదివేలు మాత్రమేనని, ఆయనకు వచ్చిన ఓట్లు 60 వేలు అయితే సీఎంపై లక్ష ఓట్లతో మెజార్టీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి అబద్ధాల పుట్ట అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మానుకోవాలని కోమటిరెడ్డికి గుత్తా సూచించారు. కాగా టీడీపీ నేత కంచర్ల భూపాల్రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కంచర్ల సోదరులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందుగానే కంచర్ల సోదరులు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే కంచర్ల సోదరులకు పార్టీలో గౌరవం కల్పిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ హమీ మేరకే కంచర్ల భూపాల్రెడ్డికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఇప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామంతో సుఖేందర్రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. -
‘ఆయనవి కోతి చేష్టలు...నమ్మొద్దు’
సాక్షి, నల్లగొండ: పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నల్లగొండలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజకీయ ఉనికి కోసమే ఛలో అసెంబ్లీ పేరుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పత్తికి కొంత నష్టo వాటిల్లిన మాట వాస్తవమన్నారు. అందుకే పత్తి రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు చులకన అవుతున్నాయని అన్నారు. ఛలో అసెంబ్లీ ఎందుకో కోమటిరెడ్డికే తెలియాలని వ్యాఖ్యానించారు. జిల్లాలో 59 ఐకేపీ సెంటర్లు, 18 పత్తి కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తే తన ఉనికి తగ్గిపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భయపడుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ను బీట్ చేయడానికి, రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి చలో అసెంబ్లీ అని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వ్యవసాయం అంటే తెలియని కోమటిరెడ్డి రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారన్నారు. ఆయన కోతి చేష్టలను రైతులు నమ్మొద్దని కోరారు. కాగా పత్తి రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 27న తలపెట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు’ తప్పా అనే స్ఫూర్తితో రైతుల తరఫున తానే ముందుండి పోరాడుతానని కోమిటిరెడ్డి నిన్న తెలిపారు. భవిష్యత్లో ఎంపీ, ఎమ్మెల్యే ఏదీ కాకున్నా రైతుల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. -
కోమటిరెడ్డివి చిల్లర రాజకీయాలు
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతి భ్రమించి చిల్లర రాజకీయాలు చేశారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమిర్శించారు. కోమటిరెడ్డిని పరామర్శిస్తామంటున్న జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో జానారెడ్డి, ఉత్తమ్లను ఎన్నో సార్లు కోమటిరెడ్డి అవమానించాడని గుర్తు చేశారు. కోమటిరెడ్డి హుందాగా ప్రవర్తించాలని, లేకుంటే పరాభవాలు తప్పవని హెచ్చరించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కోమటిరెడ్డి రాజకీయంగా పరిణతి సాధించలేదని విమర్శించారు -
రణరంగం
⇔ పోటాపోటీ నినాదాలతో రాళ్లు రువ్వుకున్న శ్రేణులు ⇔ పగిలిన తలలు, చిరిగిన చొక్కాలు.. కార్లు, బైక్లు ధ్వంసం ⇔ యుద్ధభూమిని తలపించిన ఎస్సెల్బీసీ ప్రాంగణం ⇔ కోమటిరెడ్డిని బలవంతంగా బయటకు పంపించిన పోలీసులు ⇔ వైఎస్ విగ్రహం వద్ద వెంకట్రెడ్డి ధర్నా.. ‘మిర్యాల’కు తరలింపు ⇔ బత్తాయి మార్కెట్కు శంకుస్థాపన చేసిన మంత్రులు ⇔ హరీశ్ రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ సుఖేందర్రెడ్డి సాక్షి, నల్లగొండ : సాయంత్రం 4 గంటలు.. నల్లగొండ నుంచి సాగర్ వెళ్లే రహదారిలో గంధంవారి గూడెం గ్రామ సమీపంలోని ఎస్సెల్బీసీ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వస్తుండడంతో టెంట్లు,మైకులతో ఆ ప్రాంతమంతా హడావుడిగా ఉంది. తెలంగాణ పాటలు, ఉపన్యాసాలతో అక్కడ ఉత్సాహకర వాతావరణం కనిపిస్తుండగానే ఉన్నట్టుండి గాల్లోకి రాళ్లు లేచాయి. ఏంటీ... రాళ్ల వాన ఏమైనా కురుస్తుందా అని ఆలోచించేలోపే ఆ వాన యుద్ధంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు, గుండ్లు గాలిలో రయ్యిమని వచ్చి తలలు పగులగొట్టాయి. అవే రాళ్లు కార్ల అద్దాలు, బైక్లను ధ్వంసం చేశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసినంత తేలికగా రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రదేశం అరగంటకు పైగా యుద్ధభూమిగా మారింది. కర్రలు ఓ చేత్తో, రాళ్లు మరో చేత్తో పట్టుకుని ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్లగొండలో మంగళవారం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ రణరంగమే జరిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లా రైతుల చిరకాల కోరిక అయిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి రానుండడంతో టీఆర్ఎస్ నేతలు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. తొలుత మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మర్రిగూడ బైపాస్ నుంచి కోమటిరెడ్డి బైక్ర్యాలీతో క్లాక్టవర్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి ర్యాలీగా బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసే ప్రదేశం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డిని చూసి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను కూడా కార్యక్రమంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసిన టెంటు కింద కూర్చున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రులు వచ్చే సమయం సమీపిస్తుండడం, టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ర్యాలీతో పట్టణం నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి వస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన పోలీసులు కోమటిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. వెంకట్రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా వెళ్లిపోతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు. గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు పరుగులు తీశారు. దీంతో రాళ్లు గాల్లోకి లేచాయి. అటునుంచి రాళ్లు రావడంతో సభాప్రాంగణంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న రాళ్లను కి విసిరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణుల వైపు నుంచి కూడా రాళ్లు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో తలలు పగిలాయి. ఇరు పార్టీల కార్యకర్తలు తమకు దొరికిన కార్లు, బైక్లను ధ్వంసం చేశారు. ఇలా అరగంటకు పైగా సాగర్ రోడ్డు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మాటల యుద్ధం రాళ్ల యుద్ధం ముగిసి కోమటిరెడ్డి అరెస్ట్.. ఆ తర్వాత బత్తాయి మార్కెట్ శంకుస్థాపన.. అనంతరం కూడా ఇరుపార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకున్నారు. తన అరెస్ట్ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిలాల్లో టీఆర్ఎస్ నేతలందరూ నయీం అనుచరులేనని, రౌడీల్లా మారి జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, బత్తాయి మార్కెట్ బహిరంగసభలో మాట్లాడిన ఎంపీ సుఖేందర్రెడ్డి, మంత్రులు హరీశ్, జగదీశ్ కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డిని ఎంపీ సుఖేందర్రెడ్డి కల్లుతాగిన కోతితో పోల్చారు. ప్రతిపక్షాలు పాటించాల్సిన సంప్రదాయాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తెలియవని, చీప్ పాపులారిటీ కోసం ఆయన పాకులాడుతున్నాడని విమర్శించారు. హీరో అనిపించుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించిన కోమటిరెడ్డికి టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఆగమాగం ఎందుకు చేసిండు.. : మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే, మంచి పేరు తమకు వస్తుందనే దుగ్ధతోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇలా వ్యవహరించారని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘మీ ఎమ్మెల్యేకు ఎందుకంత తొందరో అర్థమైతలేదు. మేమేమీ ఏసీలో కూర్చోలేదు కదా.. 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్ అడుగుతున్నా కాంగ్రెసోళ్లు చేయలేదు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్రెడ్డి మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మేం చేస్తుంటే కుండీలు ఎత్తేసుడు.. ఫ్లెక్సీలు చించుడు.. ఎందుకింత ఆగమాగం చేసిండో అర్థం కావడం లేదు. రసాభాస చేస్తే పేరు రాకుండా పోతుందనే ఉద్దేశంతోనే.’ అని ఆయన వ్యాఖ్యానించారు. మేం కరవలేదు.. బుస మాత్రమే కొట్టాం : మంత్రి జగదీశ్ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన గొడవపై మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డిని కోతి అనడానికి కూ డా లేదని, అంతకన్నా దరిద్రం గా ఆయన తయారయ్యాడని అ న్నారు. మీడియాలో కనిపిం చాల నే ఆలోచనతో చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు. అరాచకా లు, చిల్లర వ్యవహారాలను జిల్లాలో సాగనీయబోమని, అలా చే యాలని చూస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించా రు. ‘ఇవి ఇంక మీ జాగీర్లు కావు. తెలంగాణ ప్రజల అడ్డాలు. మేం పూర్తిగా కరవలేదు. కేవలం బుస మాత్రమే కొట్టాం.’ అని వ్యాఖ్యానించారు. మళ్లీ ధర్నా తనను శంకుస్థాపన ప్రదేశం నుంచి బలవంతంగా పోలీసులు పంపించివేయడాన్ని, తమ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దేవరకొండ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవరిస్తున్నారని, వారి అరాచకాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని ఆయన హెచ్చరించారు. ఇంతలో ఎస్పీ ప్రకాశ్రెడ్డి అక్కడకు చేరుకుని కోమటిరెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు ఆయనను మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే, కోమటిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించాయి. కోమటిరెడ్డిని అరెస్టు చేస్తున్న సందర్భంగా నల్లగొండలో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కోమటిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి మార్కెట్ వద్దకు చేరుకుని శంకుస్థాపన చేశారు. -
'తెలంగాణ రైతులకు ఏపీ ఇబ్బందులు'
నల్లగొండ: పులించితల ప్రాజెక్ట్లో నీటి నిల్వ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే ఎవరికి మంచిది కాదన్నారు. నిబంధనల ప్రకారం పులిచింతలలో 4 టీఎంసీలను నిల్వ చేసి లిఫ్ట్ల కింద ఉన్న ఆయకట్టుకు నిర్భందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లో ఈ సారి నల్లగొండకు రైల్వే కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. ప్రతిసారి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఈ సారైన బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. -
అది కేసీఆర్ సొంత ఇల్లు కాదు: గుత్తా
నల్లగొండ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బడాబాబుల చర్యలు తీసుకుని నల్లధనం వెలికితీస్తే ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కేదని చెప్పారు. తాను రాసిన లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లు రద్దు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఆ లేఖలో ప్రత్యామ్నాయాలు కూడా రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కొత్త క్యాంపు కార్యాలయంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. క్యాంపు ఆఫీసు కేసీఆర్ సొంతిల్లు కాదని, ప్రభుత్వ భవనమని స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్ లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన అధికార నివాస భవన సముదాయంలోకి గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు గృహప్రవేశం చేశారు. -
జిల్లాను హరితవనంగా మార్చాలి
పెద్దఅడిశర్లపల్లి : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జిల్లాను హరితవనంగా మార్చాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం పీఏపల్లి మండలం గుడిపల్లి, కేశంనేనిపల్లి గ్రామాల్లో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని పేర్కొన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధర్మయ్య, ఎంపీడీఓ జావెద్అలీ, జెడ్పీటీసీ తేరా స్పందనరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తేరా గోవర్ధన్రెడ్డి, గుడిపల్లి సర్పంచ్ శీలం శేఖర్రెడ్డి, గుడిపల్లి ఎంపీటీసీ వడ్లపల్లి చంద్రారెడ్డి, కేశంనేనిపల్లి సర్పంచ్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట్రెడ్డి, నాయకులు మారం కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో ‘డిండి’ ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు
కొండమల్లేపల్లి : త్వరలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు వేయనున్నట్లు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం కొండమల్లేపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రధానంగా జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపొందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చి మొదటగా హరితహారం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించారన్నారు. పిల్లలను ఏవిధంగా చూసుకుంటామో నాటిన ప్రతి మొక్కను అదేవిధంగా చూసుకోవాలని సూచించారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్రెడ్డి, మాడ్గుల యాదగిరి, వస్కుల కాశయ్య, పస్నూరి వెంకటేశ్వర్రెడ్డి, అల్గుల సైదిరెడ్డి, నాగవరం రాజు, తేరా గోవర్ధన్రెడ్డి, శిరందాసు కృష్ణయ్య, అబ్బనబోయిన శ్రీనివాస్యాదవ్, దస్రూనాయక్, వెంకటయ్య, ఆప్కో సత్తయ్య తదితరులున్నారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం చింతకుంట్లలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్రెడ్డి, సర్పంచ్ శవ్వ యాదమ్మవెంకటయ్య, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్యాదవ్, ఎక్సైజ్ సీఐ జిలానీ, ఎస్ఐ పరమేశ్వర్గౌడ్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, పస్నూరి వెంకటేశ్వర్రెడ్డి తదితరులున్నారు. -
బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ?
నల్గొండ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత రేవంత్రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కండువాలు కప్పుతున్నది కనిపించడం లేదా అని రేవంత్ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నేను గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగితే...పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. నన్ను విమర్శించే స్థాయి ఉత్తమ్కుమార్కు లేదని గుత్తా స్పష్టం చేశారు. -
‘గుత్తా’ రాజీనామా చేయాలి
చౌటుప్పల్ : రంగులు మార్చే ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తూ, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీతో వచ్చిన ఎంపీ పదవికీ రాజీనామా చేయాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి వెళ్తూ, చౌటుప్పల్లో ఆగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్ప దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గుత్తా రాజీనామా చేసే దాకా టీవీల్లో పార్టీ ఫిరాయింపులు, అవినీతి గురించి నీతులు మాట్లాడొద్దన్నారు. గుత్తాతో పాటు ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్ తమ పదవులకు రాజీనామా చేసే దాకా వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రీ-డిజైనింగ్ల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే టెండర్లు పిలుస్తుందన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సందీప్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నగోని అంజయ్యగౌడ్, జక్కలి అయిలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు హన్నూభాయ్, గంగాపురం గంగాధర్, కొసన ం భాస్కర్రెడ్డి, నల్ల గణేశ్, ఎరుకల మల్లేశంగౌడ్, గ్యార కిష్టయ్య, కాటేపల్లి శేఖర్, ఎంఎన్గౌడ్, మల్లారెడ్డి, పర్వతాలు, చలమందరాజు, అంజిరెడ్డి, రవి, మహేశ్ పాల్గొన్నారు. -
గుత్తా అండ్ కో తో ఉత్తమ్ చర్చలు
టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్న పలువురు సీనియర్ నాయకులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావులతో చర్చలు జరుగుతున్నాయని, వారు కాంగ్రెస్లోనే కొనసాగేలా ఒప్పిస్తున్నారని ఆయన చెప్పారు. నేను టీఆర్ఎస్లో చేరట్లేదు: సురేష్ రెడ్డి కాగా, తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన ఫాంహౌస్లో కలిసినట్లుగా వచ్చిన వార్తా కథనాలలో వాస్తవం లేదని ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు తాను ఆయనను కలవలేదని, తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 100 ఏళ్లుగా అనుభవం ఉందని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. -
'మీ రెండు సీట్లతో తెలంగాణ సాధ్యమయ్యేదా?'
నల్గొండ : టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో గుత్తా విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వొద్దని హుడ్కోకు తాను లేఖ రాయలేదని స్పష్టం చేశారు. ఎస్టిమేషన్ సరిగ్గా లేదని... ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని మాత్రమే తాను లేఖ రాసినట్లు గుత్తా సుఖేందర్రెడ్డి వివరణ ఇచ్చారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని... కేసీఆర్ అప్పుల ఊబిగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో మిషన్ భగీరథకు కానీ... డబుల్ బెడ్రూమ్ కానీ పైసా కేటాయించలేదని గుత్తా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని గుత్తా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కానీ... అభివృద్ధి ముసుగులో అవినీతికి... అలాగే తెలంగాణ ముసుగులో ఆంధ్ర పాలన సాగిస్తున్న దానికే వ్యతిరేకమని గుత్తా పేర్కొన్నారు. అయితే మిషన్ భగీరథకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఎస్టిమేషన్లో మాత్రం తప్పు ఉందని... వాటిని పరిశీలించి లోన్ ఇవ్వాలని మాత్రం హుడ్కో కి రాసిన లేఖలో పేర్కొన్నానని చెప్పారు. అలాగే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి స్థానాలు 2 మాత్రమే ఉన్నాయి. ఆనాడు టీ కాంగ్రెస్ ఎంపీలంతా ఒక్కటిగా ఉండి.. పార్టీ అధిష్టానానికి ఇబ్బంది అయినా పార్లమెంట్లో తెలంగాణ పక్షాన పోరాడి.. ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చామని తెలిపారు. అలా వచ్చిన రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటామా అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. పార్లమెంట్లో మా గళం,మా మద్దతు లేకపోతే మీ రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయేదా! అసలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక పోతే తెరాస పార్టీ ఎక్కడిది...మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడివి అంటూ పాలక టీఆర్ఎస్ కి ప్రశ్నలు సంధించారు. బంగారు తెలంగాణ కోసం ,అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 ఎన్నికలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణ చేసి ప్రజలపై లేని భారం వేస్తున్నారని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర పాలనా ముసుగులో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పరిపాలన టీఆర్ఎస్ సాగిస్తుందని దీనిని ఖండిస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
'రూ. వేల కోట్ల అవినీతిని అడ్డుకునేందుకే..'
హైదరాబాద్: మిషన్ భగీరథలో జరుగుతున్న రూ. వేల కోట్ల అవినీతిని అడ్డుకునేందుకే పలు కేంద్ర సంస్థలకు లేఖ రాసినట్టు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ మిషన్ భగీరథ అంచనాలను ఆంధ్రా కాంట్రాక్టర్ ఖరారు చేశారన్నారు. రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 వేల కోట్లు ఆదా చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తప్పులు ఎత్తి చూపితే సీఎం కేసీఆర్ ఉలికిపడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాపాలు చేసిందంటున్న కేసీఆర్ తెలంగాణ ఇచ్చి కాంగెస్ తప్పు చేసిందో లేదో చెప్పాలన్నారు. -
'వారిద్దరే పార్టీలో సమర్థులైన నేతలు'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాచరికపు వ్యవస్థ కొనసాగుతోందని ఆరోపించారు. ఫిరాయింపుల వల్లే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పీసీపీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిలే కారణమంటూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని గుత్తా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి కంటే సమర్థవంతమైన నేతలు ఎవరూ లేరని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు. -
'వాళ్లు నాయకుల్ని ఆకర్షిస్తే.. మేం ప్రజల్ని ఆకర్షిస్తాం'
నాగోలు(హైదరాబాద్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తామని నల్లగొండ ఎంపీ, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాయమాటలను నమ్మి నగర ప్రజలుమోసపోవద్దని పిలుపునిచ్చారు. మెట్రోరైలు, కష్ణాజలాలు, అనేక అభివద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్లతో కలిసి గుత్తా సోమవారం ఎల్బీనగర్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తోందని, గత ఎన్నికలలో టీఆర్ఎస్కి పోటీ చేసే అభ్యర్థులే లేరని అధికారంలోకి రాగానే ఆకర్ష్ ఆపరేషన్ ద్వారా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటోందని విమర్శించారు. 'టీఆర్ఎస్ నాయకులను ఆకర్షిస్తే మనం ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరిద్దాం' అని కార్యకర్తలకు చెప్పినట్లు గుత్తా పేర్కొన్నారు. బీజేపీగానీ, ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి చేసిన ఘనత ఏమీ లేదని ఎద్దేవాచేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తామని, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 స్థానాలను కాంగ్రెసే కైవసం చేసుకుంటుందన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. -
విపక్షాల అంతానికే చండీయాగం: గుత్తా
నల్లగొండ: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను అంతం చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగాన్ని తలపెట్టిన ట్లుగా అనిపిస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలనే దురాలోచన ఏ పార్టీకి కూడా న్యాయం చేయదనే విషయాన్ని సీఎం గుర్తెరగాలని చెప్పారు. వలస రాజకీయాలను ప్రోత్సహించకుండా మంత్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. -
'పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారు'
నల్గొండ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం నల్లొండలో నిప్పులు చెరిగారు. మొన్నటి వరకు తిట్టుకున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు. కేసీఆర్, చంద్రబాబులు ఇరు రాష్ట్ర ప్రజలకు భారంగా మారారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు పట్టించుకోకుండా పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. బతుకమ్మ పేరుతో కేసీఆర్ రూ. 100 కోట్లు దుబారా చేశారన్నారు. బతుకమ్మ ఉత్సవాలను పలు ప్రభుత్వ శాఖలపై బలవంతంగా రుద్దారని కేసీఆర్పై గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. -
'అలా అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే'
నల్లగొండ: బీజేపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు గాంధీ కుటుంబంపై ఆరోపణలకు పాల్పడుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులపై విమర్శలు చేయటంపై ఆయన స్పందించారు. గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయటమంటే సూర్యుడిపై ఉమ్మేయడమేనని చెప్పారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే బీజేపీ అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. వాటిని వెలుగులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిన క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగిందని చెప్పారు. అంతేకానీ సమావేశాలను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ అడ్డుకోలేదని వివరించారు. 15 నెలల కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తప్ప సాధించింది ఏమీలేదని ఏద్దేవా చేశారు -
నీ ఇంటికి వచ్చేవి కృష్ణా నీళ్లు కావా: ఎంపీ గుత్తా
నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి రంగాల్లో జరిగిన అభివృద్ధిని కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో గురువారం మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో నీ ఇంటికి వస్తున్నవి కృష్ణా నీళ్లు కావా? అవి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వచ్చినవే కదా..?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో కాంగ్రెస్ నాయకులను దూషించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో తాను, మాజీ ఎంపీ రాజగోపాల్రెడ్డి పోరాడుతున్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్ హాలు దర్వాజ దగ్గరకు వచ్చి తొంగిచూసిన వెళ్లిన సంగతి మరిచిపోవద్దన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఏదోరకంగా ఆమోదం పొందేవిధంగా చూడాలని చెప్పినప్పుడు తాము మీకు సహకరించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు తాము చవట దద్దమ్మల్లాగా కనపించని మీకు.. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నామని పేర్కొన్నారు. -
'రాక్షస పాలన కొనసాగిస్తున్నారు'
నల్లగొండ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విధానాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీఎం తుంగలో తొక్కి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం నల్లగొండలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు వెలువడి పదిహేను రోజులు కావస్తున్నా పార్లమెంటరీ కార్యదర్శులను కొనసాగించడం చట్టాన్ని అగౌరవ పర్చడమేనన్నారు. కేసీఆర్ రాక్షస మనస్తత్వంతో రాచరిక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన రైతు భరోసా యాత్రను విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. టీడీపీలో మంత్రి పదవులు వెలగబెట్టిన పోచారం, తుమ్మల లాంటి వారు... కాంగ్రెస్ హాయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు వంటి వారికి రాహుల్ యాత్రను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అని ప్రశ్నించారు. -
రాహుల్ను విమర్శించడం తగదు: గుత్తా
నల్గొండ: పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చెల్లదని హైకోర్టు ఆదేశించిన సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించడం తగదని ఆయన టీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో కిసాన్ సందేశ్ యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. దాంతో గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా స్పందించారు. -
'కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు'
ఢిల్లీ:నల్లొండ జిల్లా నాగార్జుసాగర్ లో మూడు రోజుల పాటు జరిగిన టీఆర్ఎస్ శిక్షణా తరగతుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలకు కేసీఆర్ అసలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ప్రభుత్వం దళితులకు భూములు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. -
ఎన్హెచ్గా కోదాడ-కల్వకుర్తి మార్గం
కేంద్రానికి ఎంపీ గుత్తా విజ్ఞప్తి న్యూఢిల్లీ: కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ-కల్వకుర్తి రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధిపరచాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనల కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేస్తే ఇది వెనకబడిన ప్రాంతాల అభ్యున్నతికి, పారిశ్రామికరంగ అభివృద్ధికి, పర్యాటక కేంద్రాల అనుసంధానానికి దోహదపడుతుంది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రికి చాలాసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపింది. అందువల్ల తక్షణం దీనిని జాతీయ రహదారిగా ప్రకటించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని గుత్తా పేర్కొన్నారు. -
మాటల యుద్ధం
నిన్నమొన్నటి వరకు వారిద్దరూ ఒకే పార్టీలో ఉండి కలిసి పని చేసిన వారు. మనస్పర్ధలున్నా ఏకతాటిపై నడిచారు. ఇద్దరు ఓ ఉన్నత హాదాల్లో ఉన్నవారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్యత చెడింది. మాటల యుద్ధం మొదలయ్యింది. రోజు రోజుకూ అంతరాలు పెరుగుతున్నాయి. ఒక వైపు మాటల తూటాలు, మరో వైపు నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిద్దరిలో ఒకరు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి కాగా, మరొకరు నల్లగొండ జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్. దేవరకొండ మూడు సార్లు ఎంపీగా పని చేసిన అనుభవం, దేవరకొండ నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి. ఎమ్మెల్యేగా పని చేసి అన్నీ తానై నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీ స్థానాలను, ఎంపీపీ స్థానాలను ఒంటి చేత్తో గెలిపించుకున్న నాయకుడు బాలునాయక్. నిన్నమొన్నటి వరకు వీరిద్దరూ కలిసే పని చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో వీరిద్దరికి మంచి పేరుంది. అయితే మారిన సమీకరణలు, పొత్తులు, ఎత్తుల కారణాలతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య సఖ్యతలేదు. మాటల యుద్ధం పెరుగుతోంది. దేవరకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బాలునాయక్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు. దీంతో ఆయన వెంట నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు కదిలారు. ఇంత వరకు బాగానే ఉన్నా వీరిద్దరూ ప్రస్తుతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ పార్టీలో ఒకరి కుట్ర వల్ల తాను బలైనట్లు తనపై గతంలో కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడానికి ఓ వ్యక్తే కారణమంటూ పరోక్షంగా గుత్తాను విమర్శించారు. ఓ వైపు జానారెడ్డిని కొనియాడుతూనే గుత్తా సుఖేందర్రెడ్డిని విమర్శించారు. తనను నమ్ముకున్న జనం కోసం, నియోజకవర్గ అభివద్ధి కోసం పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో గుత్తా సుఖేందర్రెడ్డి కూడా ప్రత్యారోపణలు ప్రారంభించారు. తాను మోసం అన్న మాట ఎరుగనని, కుట్రలు తనకు తెలియవని చెబుతూనే పొత్తులో భాగంగా దేవరకొండ సీటు గల్లంతయినా సమష్టిగా పనిచేసి బాలునాయక్ను జెడ్పీ చైర్మన్ను చేశామన్నారు. అవసరాల కోసం వెళ్లి అనవసర ఆరోపణలు చేయవద్దని విమర్శించారు. అయితే ఈ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైనా వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం గత కొంత కాలం నుంచే నడుస్తోంది. తన సీటు గల్లంతు కావడానికి గుత్తా సుఖేందర్రెడ్డే కారణమన్న బలమైన నమ్మకంతో బాలునాయక్ ఉండగా, క్యాడర్ను మొత్తం ఆయన టీఆర్ఎస్లోకి చేర్చే ప్రయత్నం చేస్తుండగా వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇరువురు ప్రయత్నిస్తుండగా గుత్తా సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ క్యాడర్కు దేవరకొండ నియోజకవర్గానికి ఎంపీనైనా, ఎమ్మెల్యేనైనా తానేనని అన్నింటా ముందుంటానని భరోసా కల్పిం చడం, దేవరకొండకు తరచు ఆయన వస్తుండటంతో ఆయన కూడా నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. పార్టీపరంగా నియోజకవర్గంలో గుత్తాకంటూ కొంత విశ్వసనీయత ఉండటంతో ఆయన నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఏదేమయినా వీరిద్దరి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఎవరికి లాభిస్తుందో, ఎవరికి నష్టం చేకూరుస్తుందో వేచి చూడాలి. -
ముందుకు పడని ‘దత్తత’ అడుగులు
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. అన్ని రంగాల్లో వెనుకబడిన గ్రామాలను ప్రజాప్రతినిధులు దత్తత తీసుకుని అభివృద్ధి పథంలో నిలపడమే ఈ పథకం ఉద్దేశం. అయితే జిల్లాలోని నాలుగు గ్రామాలను ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్నారు. కానీ వాటికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలోని దత్తత గ్రామాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - దేవరకొండ / భువనగిరి / వలిగొండ / మర్రిగూడ / ఆలేరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన’కు దారితెన్నూ లేకుండా పోయింది. ఆర్భాటంగా దత్తత గ్రామాలను ప్రకటించి నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా నివేదికల పర్వమే కొనసాగుతోంది. ఈ పథకంపై మండల స్థాయి అధికారులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలోని పలువురు నేతలు తీసుకున్న దత్తత గ్రామాల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్. దేవరకొండ : నియోజకవర్గ కేంద్రమైన దేవరకొండ పరిధిలో గల చింతకుంట్ల గ్రామాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం కింద డిసెంబర్లో దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అభివృద్ధి అడుగులు పడలేదు. సర్వేలు, సమావేశాలు, నివేదికలకే సమయం గడిచిపోయింది. వీఆర్వో స్థాయి అధికారులతో ఒకసారి ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోసారి చింతకుంట్ల గ్రామ పంచాయతీలోని అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అవసరాలను గుర్తించారు. నోడల్టీమ్ గ్రామ పరిధిలోని కొర్రతండా, దేశ్ముఖోనితండాల్లో పర్యటించి.. అక్కడి అవసరాలను గుర్తించి సీపీఓకు నివేదిక అందించినట్లు సమాచారం. కానీ, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన నివేదిక డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తికానట్లు తెలుస్తుంది. అయితే దత్తత గ్రా మాలపై అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడం, దత్తత గ్రామాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఇంకా ముందడుగే పడలేదు. దత్తత గ్రామానికి ఒక్కసారే వచ్చిన గుత్తా మూడు నెలల క్రితం చింతకుంట్లను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఎంపీ సుఖేందర్రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే గ్రామానికి వచ్చారు. కృష్ణా జలాలు అందించాలి గ్రామంలో మంచినీటి కోసం ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించి తాగడానికి కృష్ణా జలాలు అందించాలి. దీంతో పాటు తండాలో సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. గతంలో ఇళ్లు నిర్మించుకోలేనివారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి. అధికారులు గత నెల ఇంటింటి సర్వే నిర్వహించి మౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు. -కొర్ర పాండు, కొర్రతండా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం చింతకుంట్లలో సమకూర్చాల్సిన మౌలిక వసతుల గురించి నోడల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామంలో పీహెచ్సీ సెంటర్, హైస్కూల్ భవనం, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, డ్రెయినేజీ, గ్రంథాలయం, పశువైద్యశాల, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల ఏర్పాటు విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశాం. అంతేకాకుండా గ్రామానికి కృష్ణా జలాలు సరఫరా చేయాలి. - యాదమ్మ, సర్పంచ్, చింతకుంట్ల రోడ్డు అధ్వానంగా ఉంది మా గ్రామానికి బీటీ రోడ్డు లేదు. చిల్కమర్రి గేటు నుంచి దేశ్ముఖోనికుంట వరకు మట్టి రోడ్డు అధ్వాన్నంగా ఉంది. దీనికి తోడు గతంలో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. దత్తత గ్రామంగా ఎంపికైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. -మాణిక్యం, దేశ్ముఖోనికుంట -
గుత్తా సోదరులకు మాతృవియోగం
చిట్యాల/చైతన్యపురి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, నార్మక్స్ చైర్మన్ జితేందర్రెడ్డి తల్లి సరస్వతమ్మ(80) ఆకస్మికంగా మృతిచెందారు. సరూర్నగర్లోని సుఖేందర్రెడ్డి సోదరుడు మధర్డెయిరీ చైర్మన్ జితేందర్రెడ్డి ఇంటిలో ఆమె తుదిస్వాస విడిచారు. మృతి వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖు లు, బంధువులు సోమవారం ఉదయం ఆమె పార్థీవశరీరాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. తల్లి చని పోయిన సమయంలో ఆమె రెండవ కుమారుడు జితేందర్రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఆమె మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి తీసుకొచ్చారు.జితేందర్రెడ్డి సాయంత్రం ఉరుమడ్లకు చేరుకున్న తరువాత అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖుల నివాళి కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి, తెలంగా ణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య, వరంగల్ ఎంపీ సీతారాంనాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరుజానారెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎస్పీ ప్రభాకర్రావు, డీఈఓ విశ్వనాథరావు, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజ గోపాల్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీం ద్రనాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, ఎమ్మెల్సీలు కర్నెప్రభాక ర్, పూలరవీందర్, మాజీఎమ్మెల్యేలు జూలకంటిరంగారెడ్డి, నర్సింహయ్య, ఉజ్జని యాదగిరిరావు, డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్, భువనగిరి, మిర్యాలగూడ, మేడ్చల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నర్రా రాఘవరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎలిమినేటి ఉమామాదవరెడ్డి, గుత్తా మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్యనాయక్, డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, సుం కరి మల్లేష్గౌడ్, తూడి దేవెందర్రెడ్డి, గూడురు నారాయణరెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బోందుగుల నర్సింహారెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, బడుగుల లింగయ్య యా దవ్, మోతె సోమిరెడ్డి, మార్కెండేయు లు, రెగట్టె నర్సింహారెడ్డి, రెగట్టె మల్లికార్జున్రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, శేపూరి రవీందర్, అల్లంపల్లి నర్సింహ, గాదె నిరంజన్రెడ్డి, అమరేందర్రెడ్డి, గుండగోని వెంకటేశ్వర్లు, గంట్ల దయాకర్రెడ్డి, కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి తది తరులు నివాళులర్పించారు. -
సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి: గుత్తా
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏఎంఆర్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్) కింద సాగవుతున్న రైతులకు రబీకి వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి విడుదలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, కృష్ణా ట్రిబ్యునల్ లతో మాట్లాడి రైతులకు వెంటనే విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
'సీఎం కావాలని కీలక నేతలు కలలు కన్నారు'
హైదరాబాద్: కొందరు కీలక నేతలు సీఎం కావాలని కలలు కన్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు సీఎం కావాలని కలలు కన్నా.. పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కలల్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చురకలంటించారు. పొన్నాల సెగ్మెంట్ లో పలువురు నేతలు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లారన్న సంగతిని గుత్తా గుర్తు చేశాడు. నల్గొండ జిల్లాలోని చాలా సెగ్మెంట్లలో పార్టీ సభ్యత్వం మందకొడిగా సాగుతుందని గుత్తా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కీలక నేతలు ఐక్యంగా లేరన్న వార్తలను కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి ఖండించారు. ఆ వార్తలు అపోహలు మాత్రమేనన్నారు. ఇకపై కీలక నేతలమంతా ఒక వేదికపైకి వచ్చి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాగా, కొన్ని పొరపాట్ల వల్ల కాంగ్రెస్ ఓడిందన్న సంగతి అందరికీ తెలుసని మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతంపై కీలక నేతలమంతా ఐక్యంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. -
'ఫిరాయింపుల అంశాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లా'
ఢిల్లీ:పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లే కారణమని మండిపడ్డారు. శనివారం రాహుల్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లడిన గుత్తా.. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ వాటాను తీసుకురావడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. -
కేనర్స్ను మొదట్లోనే గుర్తించాలి : గుత్తా
మిర్యాలగూడ : కేన్సర్ను మొదట్లోనే గుర్తించి చికిత్స నిర్వహిస్తే నయమవుతుందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో లయన్స్ క్లబ్ భాస్కర ఆధ్వర్యంలో దాచేపల్లి స్వరాజ్యం జ్ఞాపకార్థం ఆమె భర్త రామనారాయణ నిర్వహించిన ఉచిత కేన్సర్ నిర్ధారణ పరీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేన్సర్ మొదట్లోనే గుర్తించకుండా అజాగ్రత్త వహిస్తే వ్యాధి ముదురుతుందన్నారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ వల్ల కేన్సర్ జబ్బులు నయమవుతున్నాయని తెలిపారు. జిల్లాలో తొమ్మిది ఏరియా ఆస్పత్రులు, 74 పీహెచ్సీలు, 734 సబ్ సెంటర్లు ఉన్నాయన్నారు. అయినా కూడా ప్రసూతికోసం ప్రతి వంద మందిలో 77 మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, వారిలో 95 శాతం మందికి ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు. డాక్టర్లు కూడా అన్ని వర్గాల ప్రజలను ఆలోచించి వైద్యం అందించాలని సూచిం చారు. పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, మరిన్ని మెరుగైన వసతులు కల్పించడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. మహిళలకు ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన కామినేని ఆస్పత్రి డాక్టర్లను, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మీ భార్గవ్, లయన్స్ క్లబ్ భాస్కర అధ్యక్షుడు గుండా లక్ష్మీకాంతం గుప్త, ఎంపీపీ జానయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్లు మెరుగు రోశయ్య, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, లయన్స్ క్లబ్ సభ్యులు కర్నాటి రమేష్, భుజంగరావు, మాలి విజయపాల్రెడ్డి, ఏచూరి మురహరి, మామిళ్ల శ్రీనివాస్రెడ్డి, నాగయ్య, డాక్టర్ రాజు, కాంగ్రెస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కరీం, మగ్దూమ్పాష, ఉదయ్భాస్కర్గౌడ్, సైదులుబాబు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది మొసలి కన్నీరు
నీలగిరి : తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొం టున్న విద్యుత్ కొరతను నివారించడంలో ఏపీ సీఎం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం నల్లగొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 54 శాతం విద్యుత్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అవసరమైతే ఏపీలో నాలుగు గంటలపాటు కోత విధించైనా మరో నాలుగు గంటలపాటు అదనపు విద్యుత్ను తె లం గాణ ఇవ్వడంతోపాటు, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై కూడా ఉందన్నారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ బేషజాలకు పోకుండా చంద్రబాబుతో సంప్రదించి పరస్పర సహకారంతో రావాల్సిన విద్యుత్ను తెప్పించుకోవడంతోపాటు, అదనపు విద్యుత్ కొనుగోలుకు చర్చిం చాలన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు పట్టుదలకు పోవడం వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు వృథాగా కిందికి పోతుందన్నారు. విద్యుదుత్పాదన పేరుతో రెండు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఖాళీ అయిన పక్షంలో రెండో పంటకు నీరు ఇవ్వడం కష్ట సాధ్యమవుతుందన్నారు. దీంతో ఖమ్మం, నల్లగొండ జిల్లా రైతాంగం పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండే పరిస్థితులున్న నేపథ్యంలో...రెండు ప్రాజెక్టుల్లో నీటిని నిల్వను కాపాడుకోవాలన్నారు. ఉద్యోగులకు హెల్త్కార్డుల త రహాలోనే ప్రజలకు ఆరోగ్య శ్రీ కార్డులను కూడా కేసీఆర్ ఇవ్వాలన్నారు. 25 ఎకరాల రైతు సైతం లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్థితిలో లేడన్నారు. గతంలో ఉన్న రేషన్కార్డుల మించి ప్రస్తుతం ఆహారభద్రత కార్డులకు ఎక్కువ దరఖాస్తులు రావడం వెనక ప్రజల ఉద్దేశం ఇదేనని తెలిపారు. సీఎం కేసీఆర్ స్పందించి తక్షణమే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు. -
శ్రీశైలం సొరంగం పూర్తి చేయాలి
మిర్యాలగూడ : శ్రీశైలం సొరంగ మార్గాన్ని త్వరగా పూర్తిచేసి జిల్లాకు సాగునీటిని అందించాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం స్థానిక ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.4500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చెల్లింపులు నిలిచిపోవడం వల్ల సొరంగం పనులు ఆగిపోయాయని, నిధులు విడుదల చేసి 2015-16 వరకు పూర్తిచేయాలన్నారు. శ్రీశైలం సొరం గం 53 కిలోమీటర్లకు ఇప్పటివరకు 31కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు జిల్లాలో ఏఎమ్మార్పీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదే విధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు తెలంగాణకు ఏదో మంచి చేయాలని తపన ఉన్నప్పటికీ మంత్రులకు శాఖలపై పట్టులేదన్నారు. ఉద్యమ కాలంలో అన్ని రాజకీయ పార్టీలను తిట్టినట్లుగానే అధికారంలోకి ఇచ్చినా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలపై ఆరోపణలు మాని ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు. అదే విధంగా మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెలే భాస్కర్రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్రెడ్డి తన మార్కును నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వాలనే విమర్శిస్తూ జగదీష్రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
కరువు జిల్లాగా జెడ్పీలో తీర్మానం చేస్తాం
త్రిపురారం : వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు జిల్లాగా జెడ్పీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ వెల్లడించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మీరామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన మొదటి సర్వసభ్య సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని అధికారులు ఇప్పటి నుంచే యాక్షన్ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్యకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరువు తీవ్రం కావడంతో ప్రస్తుత ఖరీఫ్లో వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయన్నారు. ఒక పక్క విద్యుత్ సమస్య మరో పక్క తీవ్ర వర్షాభావంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడవ కాలువకు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. లిఫ్ట్లకు 16 గంటల పాటు విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, ప్రజా ప్రతి నిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా లను ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మీరామచంద్రయ్య, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధన్సింగ్ నాయక్, మండల ప్రజా పరిషత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అనుముల ప్రేమలత, ఎంపీడీఓ శ్రీరామకవచం రమేష్, ఆర్అండ్బీ డీఈ రఘవీర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏఎమ్మార్పీకి నీటి నివిడుదల చేయాలి పెద్ద అడిశర్లపల్లి : వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతల నేపథ్యంలో ఏఎమ్మార్పీకి ప్రభుత్వం వెంటనే నీటివిడుదల చేసి రైతులను ఆదుకోవాలని న ల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన జెడ్పీచైర్మన్ బాలునాయక్తో కలిసి మండలంలోని ఏకేబీఆర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వర్షాధార పంటలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ప్రాజెక్టు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని అన్నారు. -
స్థానికతపై వివాదం సరికాదు
నల్లగొండ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికత అంశంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన నివాసంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1956 ముందు స్థిరనివాసం ఏర్పరచుకున్న వారినే స్థానికులుగా పేర్కొనడం సరైంది కాదన్నారు. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని, దాంతో పాటు జోనల్ సిస్టమ్ కూడా అమల్లో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత స్థానికులు ఎవరు అనే దానిపై పూర్తిస్థాయిలో చర్చించి ఓ పరిష్కారం కనుగొన్నారని గుత్తా తెలిపారు. ప్రస్తుతం ఆ విధానమే అమల్లో ఉందని, దానినే కొనసాగించాలని చెప్పారు. స్థానికతపై లేనిపోని అపోహలు, అనుమానాలు లేవనెత్తి కొత్త సమస్యలు సృష్టించొద్దని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జిల్లా మం త్రి, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరిపేలా కృషిచేయాలన్నారు. వరికి మద్దతు ధర కంటితుడుపు చర్యే మోడీ ప్రభుత్వ నెలరోజుల పాలనలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుత్తా విమర్శించారు. వరికి మద్దతు ధర కేవలం రూ.45లు మాత్రమే పెంచడాన్ని కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల రుణ మాఫీ కంటే కూడా పండిన పంటకు మద్దతు ధర కల్పిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.ఆంధ్రప్రదేశ్లో రైతుల పంట రుణాలను మాఫీ చేసేం దుకు ఆయన మల్లగుల్లాలు పడుతున్నారని గుత్తా ఎద్దేవా చేశారు. -
విద్యుత్పై ఏపీ వాదనలు సరికాదు
నల్లగొండ : రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత విద్యుత్ విషయం లో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలు సరికాదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఇలాంటి వాదనలు, ప్రతివాదనల తో ఇరు ప్రాంత ప్రజల మధ్య విధ్వేషాలు చెలరేగుతాయన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సున్నితమైన అంశాల్లో రెండు రాష్ట్రా ల సీఎంలు సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిం చుకోవాలని సూచించారు. పోల వరం, హైదరాబాద్ శాంతిభద్రతల అంశాలపై అఖిలపక్షాలను సమావేశ పరచి పరిష్కా రమా ర్గం కనుగొనాలన్నారు. పోలవరం ముంపులోని ఏడు మండలాల ప్రజల ఆవేదనను ఆంధ్రా ప్రభుత్వం మన్నించాలన్నారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రసార మాద్యమాలు నిర్వహిస్తున్న చర్చల్లో నెగిటివ్ కోణం ఎక్కువగా ఉంటోందని, అది మంచిది కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ మీడియా ద్వంద్వ వైఖరి చూపిందన్నారు. కొన్ని చానల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం అసహించుకునే రీతిలో ప్రచార కార్యక్రమాలు చేయడం బాధాకరమన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు మునాస వెంకన్న పాల్గొన్నారు. -
యువతకు ఉపాధి కల్పిస్తా
టీడీపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి నల్లగొండ రూరల్, న్యూస్లైన్ : జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యో గ అవకాశాలు కల్పిస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి అన్నారు. నల్లగొండ వెంకటసాయి ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం ఐటీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. బీడు భూములకు సాగునీరు అందించేందుకు సొరంగ మార్గం, ఎస్ఎల్బీసీ, నక్కలగండి పూర్తి చేస్తానన్నా రు. సూర్యాపేట పాలేరు నుంచి విద్యుత్ కోతలు లేకుండా సోలార్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఏరియా ఆస్పత్రులకు అనుగుణగా మెడికల్ కాలేజీ, కళాశాలలు ఏర్పాటు చేసి వైద్య రంగానికి, విద్యకు పెద్ద పీట వేస్తామన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజల సంక్షేమాన్ని విస్మరించి తన కుటుంబ ఆస్తులను పెంచుకున్నాడని ఆరోపించారు. ఫ్లోరైడ్ గ్రామాలకు తాగునీరు ఇవ్వలేదన్నారు. జానారెడ్డి ఆస్తులపై దర్యాప్తు జానారెడ్డి దోచుకుని ఇతర రాష్ట్రాలు దాచుకోవడంలోనే సీనియార్టీ ఉందని, పవర్ ప్లాంటుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం జానారెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయా కుటుంబ ఆస్తులపైన సీబీఐ, ఈడీ, ఆర్బీఐ తదితర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. గుత్తా మింగిన కమీషన్లు, అక్రమ ఆస్తులను కక్కిస్తామన్నారు. రాజకీయ అవనీతి లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో నిలబడినట్లు తెలిపారు. జానారెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు తనపై అనేక అక్రమ కేసులు పెట్టించాడని, తన పరిశ్రమలపై సోదాలు, దాడులు చేయించినా బెదరలేదన్నారు. నరేంద్రమోడీని ప్రధాని కోసం ప్రజలు ఆదరించాలని కో రారు. అనంతరం గ్రామాలకు చెందిన యువకులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలోబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.శ్రీనివాస్రెడ్డి, మాదగోని శ్రీనివాస్గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, కాశీనాథ్, రియాజ్ అలీ, మధుసూదన్రెడ్డి, పల్లెబొయిన శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు. -
లగడపాటికి భగత్ సింగ్కు పోలికా ?
విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్తో పోల్చడం హాస్యాస్పందంగా ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లొండలో విలేకర్లతో మాట్లాడారు. ఆంగ్లేయుల బానితస్వంలో మగ్గుతున్న భారత దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పరితపించి భగత్ సింగ్ అశువులుబాసారని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటి మహానియుడితో లగడపాటిని పోలుస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకునే పార్టీలకు పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇటీవల ప్రకటించారు. ఆ క్రమంలో గురువారం లోక్సభకు బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంలో సభ వెల్ లోకి సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీ దూసుకొచ్చారు దాంతో ఆయనను అడ్డుకొనేందుకు కొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీని రక్షించేందుకు అక్కడకు చేరుకున్న లగడపాటిని కూడా అడ్డుకునేందుకు ఆ సదరు ఎంపీలు ప్రయత్నించారు. దాంతో లగడపాటి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే ను స్ప్రే చేశారు. దాంతో లోక్సభలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో సభలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజలు హర్షం ప్రకటించారు. దాంతో లగడపాటి ఆంధ్రప్రదేశ్ భగత్ సింగ్ అంటూ మీడియాలో ప్రచార హోరు మిన్నంటింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా స్పందించారు. -
బాబుకు మైండ్ పోయింది: గుత్తా
నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబు రెండుసార్లు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుట్రపూరితంగానే మంత్రి శ్రీధర్బాబును తొలగించారని ఆరోపించారు. శాసనసభా వ్యవహారాల శాఖను దుద్దిళ్ల శ్రీధర్బాబు నుంచి తప్పించి మరో మంత్రి సాకే శైలజానాథ్కు అప్పగించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే హైకమాండ్ వ్యూహం మేరకే శ్రీధర్బాబు శాఖ మార్పు జరిగిందని ప్రచారం జరుగుతోంది. విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేలా చూసేందుకు అధిష్టానం అనుమతి తీసుకునే కిరణ్ మార్పు చేపట్టినట్టు తెలుస్తోంది. -
రాయల తెలంగాణకు పూర్తి వ్యతిరేకం: గుత్తా
రేపట్టి తెలంగాణ బంద్కు టి.కాంగ్రెస్ నేతల మద్దతుండదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన నల్గొండలో మాట్లాడుతూ... 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు తాను పూర్తి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి హైదరాబాద్తో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణానే ఇస్తామని చెబుతుందన్న విషయాన్ని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం నిమషానికో మాట మార్చడం పట్ల ఆయన ఓ కింత అసహానం వ్యక్తం చేశారు. -
అశోక్బాబు, దేవినేనిపై కేసులు పెట్టాలి: గుత్తా
నల్లగొండ: సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర సభగా మారుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్రలో సీఎం చాంపియన్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్వేషాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న అశోక్బాబు, దేవినేని ఉమలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి వెల్లడించాలన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లుపై అభిప్రాయం మాత్రమే ఉంటుందని, ఓటింగ్కు అవకాశం కూడా ఉండదని గుత్తా సుఖేందర్ రెడ్డి అంతకుముందు అన్నారు. -
బాబు దీక్ష జాతీయ నేతలను ఆకర్షించేందుకే : గుత్తా
నల్లగొండ: తెలుగు ప్రజల పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్ష జాతీయనేతల దృష్టిని ఆకర్షించేందుకేనని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కోల్పోయిన ప్రాభవాన్ని జాతీయ స్థాయిలో తిరిగి పొందేందుకు ఈ ప్రయత్నమని తెలిపారు. నల్లగొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయమంటూ చంద్రబాబు, వైఎస్.జగన్ చేసిన దీక్షలు ఎంత మాత్రం పరిష్కారం చూపవన్నారు. దేశవ్యాప్తంగా డిమాండ్ లేని దీక్ష అంటే ఒక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నదేనన్నారు. అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లుపై అభిప్రాయం మాత్రమే ఉంటుందని, ఓటింగ్కు అవకాశం కూడా ఉండదన్న వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. -
చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదు: ఎంపీ గుత్తా
దేశంలో ఎక్కడ ఏలాంటి డిమాండ్ లేనటువంటి దీక్ష ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీభవన్లో చేపట్టి దీక్షే అత్యుత్తమ ఉదాహరణ అని నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మె పరిస్థితుల్లో లేరని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో గత వైభవాన్ని సంపాదించుకోవాలనే దురద తప్పా... చంద్రబాబు దీక్షలో న్యాయం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
అశోక్బాబు 56 రోజుల నాయకుడు: ఎంపీ గుత్తా
నల్లగొండ: హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్లిపోవాలనే విషయం మరో మూడు నెలల్లో తేలుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వాళ్లే హైదరాబాద్ వదిలివెళ్లాలని ఏపీఎన్జీఓ నాయకుడు అశోక్బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్పాన్సర్డ్ సీమాంధ్ర ఉద్యమానికి అశోక్బాబు 56 రోజుల కొత్త నాయకుడని, వాపును చూసి బలుపు అనుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే 10 లక్షల మందితో హైదరాబాద్ను ముట్టడిస్తామని అల్టిమేటం ఇస్తున్న అశోక్.. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఉద్యమం చేస్తే మా ఉద్యమంలా ఏళ్లకొద్దీ చేసుకోండి.. కానీ రెచ్చగొట్టి విద్వేషాలు కలిగించే రీతిలో మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్కు బెయిలొస్తే.. చంద్రబాబుకే బెంగ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు బెంగ ఉంటుంది.. కానీ, మాకెందుకుంటుందని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. చట్టప్రకారం అరెస్టులు, విడుదలలు సర్వసాధారణమని, జగన్ విడుదలవడంపై ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన బీజేపీతో పొత్తు కోసమేనని, రాజ్నాథ్సింగ్తో జరిపిన చర్చల సారాంశాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. అక్టోబర్ 3న జరిగే కేంద్ర కేబినెట్లో తెలంగాణ నోట్పై చర్చ జరుగుతుందని, ఏకే ఆంటోనీ అనారోగ్య పరిస్థితులతోనే కొంత ఆలస్యమవుతోందని తెలిపారు. -
బాబు ఢిల్లీ యాత్ర నాటకం: ఎంపీ గుత్తా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర ఓ నాటకమని నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేంధర్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసమే బాబు ఢిల్లీ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టె పనిలో భాగంగానే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత ప్రస్తావన చేస్తున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దనే హక్కు సీమాంధ్ర నేతల భార్యలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందని ప్రజాప్రతినిధుల భార్యలు శనివారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ సమావేశంలో విలేకర్లు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భార్యలు ప్రణబ్ను కలసి విజ్ఞప్తి చేయడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా సమాధానం ఇచ్చారు. -
'చంద్రబాబుకు మతిస్థిమితం కోల్పోయినట్టుంది'
ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థిమితం కోల్పోయినట్లున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రుల ఉద్యమం సరైందేనని బాబు వ్యాఖ్యానించడంపై గుత్తా మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో సీమాంధ్రలో యాత్రను ఆరంభించారన్నారు. తెలంగాణ అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు..ఇప్పుడు సీమాంధ్రలో యాత్ర ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు త్వరలోనే రెండు కళ్ల కోల్పోవడం ఖాయమని గుత్తా ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బాబు సీమాంధ్ర ప్రజలకు దగ్గరైందుకు యత్నిస్తున్నారన్నారు. -
'టీడీపీ ఎంపీలు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారు'
ఢిల్లీ:లోక్ సభలో తెలుగుదేశం సభ్యులు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని తెలంగాణ ఎంపీలు మండిపడ్డారు. సభలో టీడీపీ ఎంపీల ప్రవర్తనపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటువేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆపుతామని సీమాంధ్ర నేతల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అపోహలు పెంచుతున్నారని మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ అనేది తెలంగాణలో ఒక భాగమన్న విషయాన్ని సీమాంధ్ర నేతలు గుర్తించుకోవాలన్నారు. -
వైఎస్పై నిందలు వేయటం సరికాదు: గుత్తా
నల్గొండ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. కిరణ్కుమార్ రెడ్డికి తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలో సర్పంచ్లను గెలిపించుకోలేని ముఖ్యమంత్రి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.... ముఖ్యమంత్రి కార్యక్రమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విభజనకు ఆధ్యుడు ... చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమంటూ అపనిందలు వేయటం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు సూచించారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలనుంచి వచ్చే అనేక అంశాలపై చర్చించాలని, ఆ తరువాతే విభజన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.