పనికిరాని ప్రాజెక్టులతో బంగారు తెలంగాణా?
► సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
► దీక్షల శిబిరాన్ని సందర్శించిన పార్టీ బృందం
చిల్పూరు (స్టేషన్ఘన్పూర్) :
ఊళ్లను ముంచి పనికి రాని ప్రాజెక్టులు నిర్మించడం వలన బంగారు తెలంగాణ వస్తదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ నాలుగు తండాలతో పాటు లింగంపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో గత 24 రోజులుగా చేపడుతున్న దీక్షల శిబి రాన్ని సోమవారం సీపీఐ బృందం సందర్శించి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భం గా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటితో నింపుతామని చెప్పిన సీఎం కేసీఆర్ నేడు ఊళ్లే లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
రిజర్వాయర్ నిర్మాణం వలన చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇక్కడ 10 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదని, ఒకవేళ నిర్మించి అందులోకి ఎత్తిపోతల ద్వారా నీటిని నింపితే ఎకరాకు రూ. లక్ష ఖర్చు వస్తుందన్నారు. అంత ఖర్చు చేసి రిజర్వాయర్ను నింపినా అందులో నీరు ఇంకిపోగా మిగిలి పోయేవి కేవలం 5 టీఎంసీలేనన్నారు. సీఎం కేసీఆర్కు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశం ఉంటే ఉన్న రిజర్వాయర్ల ఎత్తు పెంచి దానికింద ఎండిపోయిన్న అన్ని చెరువులు, కుంటలు నింపాలన్నారు.
ఒకవేళ రిజర్వాయర్ కచ్చితంగా నిర్మించాలంటే 2013 చట్టం ప్రకారం భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ప్రతీ ఒక్కరికి ఉపాధి ఇవ్వాలని, అలాకాకుండా 123 జీఓ ప్రకారం నిర్మిస్తే ప్రజల చేతిలో గుణపాటం తప్పదన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఇక్కడ 10 శాతం మంది కూడా ఒప్పు కోవడం లేదన్నారు.సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి బర్ల శ్రీరాములు, భీమనాథం శ్రీనివాస్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మినారాయణ, చిల్పూరు మండల కార్యదర్శి పైస రాములు, ఎంపీటీసీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, గ్రామ సర్పంచ్ కందుకూరి రజిత, తదితరులు పాల్గొన్నారు.