
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేజారకముందే సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి సోమవారం లేఖ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె. కేశవరావు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కార్మికుల పక్షపాతి అని చెప్పుకున్న కేశవరావు.. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేజారుతున్నాయనే అనుమానంతో లేఖ విడుదల చేశానన్నారు. ‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని నేను అనలేదు. మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా చర్చలకు దిగుతా. నాతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు’’అని కేశవరావు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment