
యాదగిరిగుట్ట: థర్డ్ ఫ్రంట్ అంటూ ఇటీవల సీఎం కేసీఆర్ దేశమంతా పర్యటిస్తే ఎవరు కూడా మద్దతు ప్రకటించలేదని, ఆ ఫ్రంట్లో ఉన్నది కేవలం కేసీఆర్ ఆయన కొడుకు, కూతురేనని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కాదు.. కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేయాలని ఇటీవల పలు సభల్లో అభ్యర్థులను కేటీఆర్ అవమానించారన్నారు. ముఖం చూపెట్టలేని ఎంపీలను గెలిపిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని కోమటిరెడ్డి హామీనిచ్చారు. అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.