
కేసీఆర్ తో కేరళ సీఎం విజయన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్ ఆదివారం భేటీ అయ్యారు. సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా నగరానికి వచ్చిన విజయన్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. భోజన విరామం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించారు.
తెలంగాణలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల గురించి, ఐటీ, టూరిజం వంటి అంశాల గురించి విజయన్కు కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ సర్కార్ పథకాల అమలు పట్ల విజయన్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, శబరిమలలో తెలంగాణ అతిథి గృహం నిర్మాణం కోసం త్వరగా భూకేటాయింపులు చేయాలని కేరళ సీఎంను కేసీఆర్ కోరారు.
ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాకను నిరసిస్తూ ఆర్టీసీ కల్యాణ మండపం దగ్గర ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కేరళ సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు.