ఖైరతాబాద్లో కొలువైన మహా గణపయ్య
సాక్షి, హైదరాబాద్ : సోమవారం ఉదయం 10 గంటలకల్లా నగరంలోని అన్ని వినాయక నిమజ్జనాలు పూర్తి చేయిస్తామని సిటీ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. నిమజ్జనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 19వేల మంది పోలీసులు, 2 లక్షలకుపైగా సీసీ కెమెరాల సేవలు వినియోగించుకోనున్నామని తెలిపారు. సెంట్రల్ సెక్కురిటీ ఫోర్స్, షీ టీమ్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 8 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయనీ, మరో 14 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని తెలిపారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలను అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. నగర వ్యాప్తంగా 125 ప్రధాన స్థావరాల నుంచి నిమజ్జనానికై వినాయకులు తరలిరానున్నట్టు తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం
ఖైరతాబాద్లో కొలువైన మహా గణపతి నిమజ్జనం రేపు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తవుతుందని కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. మహాగణపయ్య శోభాయాత్ర సాగే రూట్ మాప్లో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్లోని 6వ నెంబర్ క్రేన్ పాయింట్ వద్ద ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరుగుతుందని వివరించారు. బాలాపూర్ గణేషుని శోభాయాత్ర ట్యాంక్బండ్ వరకు 18 కిలోమీటర్లు కొనసాగనుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment