
సాక్షి, హైదరాబాద్: ‘ఇతర పార్టీల్లోని కొందరు నాయకుల మాదిరిగా కేటీఆర్ డమ్మీ లీడర్ కాదు. ఆయనకు సీఎం పదవిపై సమయం, సందర్భాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో కలిసి తలసాని విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం టీఆర్ఎస్ నేతల నడుమ అంతర్గత పోటీ ఉందని, కాంగ్రెస్, బీజేపీకి దిక్కూదివాణం లేదని తలసాని ఎద్దేవా చేశారు. పార్టీ లో సుదీర్ఘ అనుభవం, సీనియారిటీ ఉన్న నేతలకు టికెట్లు రాకపోతే ఆవేశ పడొద్దన్నారు. కాగా, తాండూరు మున్సిపాలిటీ పరిధిలో కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని పి.మహేందర్రెడ్డి, రోహిత్రెడ్డి ప్రకటించారు.