ప్రేమే గెలిచింది.. | Lovers Marriage In Warangal Police Stations | Sakshi
Sakshi News home page

ప్రేమే గెలిచింది..

Mar 6 2019 6:34 AM | Updated on Mar 22 2019 11:34 AM

Lovers Marriage In Warangal Police Stations - Sakshi

పెగడపల్లిలో సెల్‌టవర్‌ ఎక్కిన మాలిక, పోలీసు స్టేషన్‌లో పూలదండలు మార్చుకుంటున్న మాలిక–బాబు

భీమారం: ప్రేమించిన వాడిని మనువాడడం కోసం చేసిన పోరాటంలో ఆమె గెలవడంతో పాటు ప్రేమను జయించింది. తన ప్రియుడితో మరో యువతికి నిశ్చితార్థమైందని తెలిసిన  ఆమె సెల్‌ టవరు ఎక్కింది. 7 గంటల హైడ్రామా అనంతరం  టవర్‌ పైనుంచి కిందికి దిగింది. కుటుంబ  సభ్యులు, స్థానికులు, బంధువుల ఆందోళన  అన ంతరం ప్రేమ కథ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది.  రంగంలోని దిగిన ఏసీపీ ప్రియుడిని పిలిపించి ప్రేమ జంటకు కౌనెల్సింగ్‌ ఇచ్చారు. అనంతరం రాత్రి పోలీసుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు.

వివరాల ప్రకారం ..
హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన దామెర మాలిక, నక్క బాబు పదేళ్ల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.  బాబు సింగరేణి ఉద్యోగి కాగా,  మాలిక  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల  బాబుకు అదే గ్రామానికి చెందిన మరో యువతితో   నిశ్చితార్థం జరిగింది. ఈవిషయమై మాలిక అదే రోజు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. అయినా నిశ్చితార్థం తంతు ఆగలేదు.

ప్రియుడి విచారణ. 
ఇదిలా ఉండగా పోలీసులు  బాబును కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు.  మాలికతో ఉన్న సంబంధంపై అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.  సాయంత్రం వరకు సమయం ఇస్తాం... ఆలోచించుకోవాలని సూచించారు.  కొద్దిసేపు వారు మాట్లాడుకునే అవకాశం కల్పించారు.

ఒక్కటయ్యారు..
ఎట్టకేలకు మాలిక తన పంతం నెగ్గిచ్చుకుంది. చివరికి ప్రియుడితో వివాహం జరిగింది. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బాబు. మాలిక ఒక్కటయ్యారు. పెళ్లి చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం మేరకు అక్కడికి చేరిన ఏసీపీ చంద్రయ్య ఆందోళనకారులను శాంతింజేశారు. అనంతరం ఇద్దరికి కౌన్సెలింగ్‌ నిర్వహించడమే కాకుండా  పెద్దమనుషులతో మాట్లాడారు. అనంతరం  ఇరువురి అంగీకారం మేరకు మాలిక–బాబు  పోలీస్‌స్టేషన్‌ ఎదుట పూలదండలు మార్చుకున్నారు. ఈసందర్భంగా మాలిక మెడలో తాళి కట్టాడు. 

న్యాయం జరగలేదని..
పోలీసుల నుంచి ఆశించిన న్యాయం జరగకపోవడంతో మాలిక మంగళవారం ఉదయం 4.30 గంటలకు పెగడపల్లి సమీపంలోని ఓసెల్‌టవర్‌ ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. సెల్‌ టవర్‌ నుంచి కిందకు దిగాలని కోరారు. అయినప్పటికీ ఆమె దిగడానికి నిరాకరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితురాలు ఉదయం 11.30 నిమిషాలకు సెల్‌ టవర్‌ దిగింది.  పోలీసులు మాలికను తమ వాహ నంలో కూర్చోబెట్టి ముందుకు సాగారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం పోలీస్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. బాబుతో పెళ్లి జరపాలని  వాహనం ఎదుట కూర్చున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాలికను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement