అక్రమ దందాలపై దృష్టి | Mancherial DCP Rakshita Krishna Moorthy | Sakshi

అక్రమ దందాలపై దృష్టి

Mar 6 2019 10:43 AM | Updated on Mar 6 2019 11:21 AM

Mancherial DCP Rakshita Krishna Moorthy - Sakshi

మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి 

మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో అక్రమదందాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మంచిర్యాల డీసీపీ రక్షిత కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ‘జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, అక్రమ దందాలు, రౌడీ షీటర్స్, గంజాయి, గు ట్కా, అటవీ సంరక్షణ, వణ్యప్రాణుల హత్యలు, ఈవ్‌టీజింగ్‌లపై ముందుగా ఆరాతీస్తాను. మండలాల వారీగా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే దానిపై పరిశీలన చేస్తా. నేరం ఏ శాఖకు సంబంధించిందో గుర్తించి సంబంధిత అధికా రుల సమన్వయంతో చట్టపరిధిలో కేసులను పరి ష్కరించేందుకు ప్రయత్నం చేస్తా..’ అని అన్నారు. డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.

 మహిళల రక్షణకు మీరు     తీసుకునే చర్యలు..?

డీసీపీ : జిల్లాలో ఈవ్‌టీజింగ్‌ పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై దృష్టి సారిస్తాను. కళాశాల విద్యార్థులకు ఈవ్‌టీజింగ్‌ వల్ల కలిగే పర్యవసానాలపై ముందుగా అవగాహన కల్పించి అటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుం టాం. షీ టీమ్‌పై ప్రత్యేక దృష్టి సారించి మహిళల రక్షణకు అండగా ఉంటా, మహిళలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షలుంటా యని హెచ్చరిస్తాం. కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర  బహిరంగ ప్రదేశాలు, సినిమా టాకీస్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేస్తాం. పోలీస్‌శాఖకు చెందిన మహిళా రక్ష, మహిళా మిత్ర అధికారులను నియమించి సమస్య తీవ్రతను బట్టి వంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటే తల్లిదండ్రుల పెంపకంలోనూ లోపం ఉందన్నది గుర్తించాలి. ఈవ్‌ టీజింగ్, ర్యాగింగ్‌ నిర్మూలనకు ఎన్‌జీవోస్, మహిళా సంఘాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తా.

నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..

డీసీపీ : సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటాం. నేరం చేసి తప్పించుకుని తిరుగుతన్న దొంగలను టెక్నాలజీ సాయంతో త్వరగా పట్టుకుంటాం. పోలీస్‌ శాఖకు అనేక సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక సాఫ్ట్‌వేర్‌ 500మంది పోలీసులతో సమానం. 

ప్రజలతో ఎలా మమేకం అవుతారు..

డీసీపీ : పోలీసులు ప్రజల పట్ల స్నేహభావంతో మెలిగేలా ప్రయత్నిస్తాం. కాలనీలు, గ్రామాలు, మండలాల్లో ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తా. ఇందులో ఇతర శాఖల సమన్వయంతోనే ముందుకు వెళ్తాం. గొడువలు జరిగిన చోట జులుంతో కాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌గా సామరస్యంగా శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చి పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజలతో పోలీస్‌లు మమేకం కావడం ద్వారా ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతోంది. నేరం చేసిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పనిచేయదు. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తా. ఫిర్యాదుదారులు నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చు.

జిల్లాలో సివిల్‌ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి.. వాటి విషయంలో ఎలా వ్యవహరిస్తారు..

డీసీపీ : జిల్లాలో సివిల్‌ తగాదాలు, భూ సంబంధ సమస్యలు అధికంగా ఉన్నాయని విన్నా, ఇదివరకు ఇక్కడ పని చేసిన అధికారులు సివిల్‌ తగాదాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొని విధుల నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ... పోలీసుల్లో మొదట మార్పు తెచ్చేందుకు కృషి చేస్తాను. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడేది లేదు. తప్పు చేసిన వారు ఎంతటి అధికారు(నేను సైతం)లైన శిక్ష అనుభవించక తప్పదు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తాం. సివిల్‌ తగాదాల్లో పోలీసుల జోక్యం ఉండదు. అవి సివిల్‌ కోర్టులోనే పరిష్కరించుకోవాలి. సమాజంలో ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటా.

జిల్లాలో మావోయిస్టుల ప్రభావంపై మీరేమంటారు..?

డీసీపీ : జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదు.అయినా వారి కదలికలపై దృష్టి సారిస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మావోయస్టులకు పేరున్న జిల్లా కాబట్టి ఇతర జిల్లాల పోలీస్‌అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తాం. మారుమూల గ్రామాలపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తాం. యువత అసాంఘిక కార్యకలపాలకు ఆకర్షితులు కాకుండా వారికి అవగాహన కల్పిస్తాం. ప్రజాహిత కార్యక్రమాల ద్వారా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం.

భూ మాఫియపై, ఇసుక రవాణా ఎక్కువగా ఉంది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.

డీసీపీ : మంచిర్యాల జిల్లాలో భూ మాఫియా, ఇసుక మాఫియ ఆగడాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. భూ మాఫియాపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. దౌర్జన్యాన్ని సహించేది లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. చట్టపరమై చర్యలు తీసుకుంటాం. భూ సమస్యలుంటే కోర్టులో, రెవెన్యూ పరంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అధికార, ధనదాహంతో దౌర్జన్యాలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవు. కోర్టు పరిధిలో తేలాల్సిన భూ వివాదాల జోలికి వెళ్లం. అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారిస్తా. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

అసెంబ్లీ ఎన్నికలను ప్రత్యక్షంగా చూశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.

డీసీపీ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఏసీపీగా ఉన్నాను. సీపీ సత్యనారాయణ సూచనలు, సలహాల మేరకు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతం చేశాం. చెన్నూర్‌ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కోటపెల్లి, నీల్వాయి, అర్జున్‌గుట్ట, సిర్సా, అన్నారం తదితర గ్రామాల్లో యాంటీ నక్సల్స్‌ టీమ్‌లు, ప్రత్యేక కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించాం ఆదే తరహాలో పార్లమెంటు ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement