
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వచ్చే మూడు రోజుల పాటు అరకొర వర్షాలే పడతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, 25న మాత్రం రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హైదరాబాద్ వాతా వరణ కేంద్రం కూడా ఇంచుమించు ఇదే సూచన చేసింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంగుతోందని, దీని కారణంగా సోమవారం కొన్నిచోట్ల అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.