
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో భాగం గా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అత్యద్భుతమని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా కొనియాడారు. ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదని, ఈ మేనిఫెస్టో ద్వారా దేశంలోని పేదల సమస్యలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని చెప్పారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ మేనిఫెస్టో ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశంలో ఖాళీ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు, జీఎస్టీలో ఏకరూపత లాం టి సంస్కరణలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.
కనీస ఆదాయ హామీ పథకంతో 2024 నాటికి దేశంలో పేదరికం అంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తా మో చెప్పకుండా దేశభద్రత లాంటి సున్నితమై న అంశంపై ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పేదరికం, రైతు సమస్యలపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చామని, 16 మందిని గెలిపించాలని టీఆర్ఎస్ కోరుతోందని.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరే హక్కు ఒక్క కాంగ్రెస్కి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సలీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment