
సాక్షి, హైదరాబాద్: కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రారంభించేందుకు అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో, మరోసారి దీనిపై పునఃపరిశీలన చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రెండు కోర్సులకు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ కామినేని దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కోదండరామ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోర్సులకు అనుమతినిచ్చే ముందు ఎంసీఐ పరిశీలకులు తనిఖీలు చేస్తారని, అలాగే తమ కాలేజీలో కూడా తనిఖీలు చేసి, పలు లోపాలను ఎత్తి చూపారన్నారు. ఈ లోపాలను సరిదిద్దుకున్నామని, మరోసారి తనిఖీ చేసిన అధికారులు, మళ్లీ లోపాలున్నాయన్నారు. లేవనెత్తిన లోపాలను సరిదిద్దుకున్నా, కోర్సులకు అనుమతినివ్వడం లేదన్నారు. అయితే ఈ వాదనలను ఎంసీఐ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. సర్జరీలు ఎన్ని చేశారన్న విషయంలో కామినేని ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, అందుకే ఈ నిబంధన విషయంలో ఎంసీఐ అధికారులు రాజీపడలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment