
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా పెరిగి పెద్దదైన చెట్టును తన వాహనంతో ఢీకొట్టి కూల్చివేసిన వాహనదారుడికి రూ. 9,500 జరిమానా విధించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా పెరిగిన చెట్టును తన వాహనంతో రాకేశ్ ఢీ కొట్టడంతో పడిపోయింది. దీన్ని గమనించిన పోలీసులు హరితహారం అధికారి ఐలయ్యకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆయన.. రాకేశ్కి జరిమానా విధించారు.
హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని ఐలయ్య తెలిపారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నతాధికారులకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, డీఈలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.