రూ.వంద కోట్లతో ఉపాధి | rupees 100 crore worth nrega works would be enacted next year in rangareddy district | Sakshi

Feb 14 2018 5:47 PM | Updated on Mar 28 2018 11:26 AM

rupees 100 crore worth nrega works would be enacted next year in rangareddy district - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు  వచ్చే ఏడాది విస్తృతంగా చేపట్టేందుకు యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి కూలీలకు మరింత ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) 2018–19 సంవత్సరానికి ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త పనులు చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పని కావాలని కోరిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో గరిష్టంగా వంద రోజులపాటు ఉపాధి కల్పించాలన్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం. వచ్చే ఏడాది రూ.100 ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఇందులో సుమారు రూ.70 కోట్లను కూలి కిందనే చెల్లించనుండడం విశేషం. జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 356 పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. వీటి పరిధిలో జాబ్‌ కార్డులు పొందిన 1.36 లక్షల కుటుంబాలు ఉపాధి పనులకు ఏ డాది పొడవునా హాజరవుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. ఇందులో కనీసం లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించా లని డీఆర్‌డీఏ లక్ష్యం పెట్టుకుంది. మరో రూ.30 కోట్లను మెటీరియల్‌ కోసం వెచ్చించనున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్ర భుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.  

నీటి సంరక్షణకు పెద్దపీట 
వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసి ప్రతి బొట్టుని భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90 శాతం పంటల సాగుకు భూగర్భ జలాలే ప్రధాన వనరు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్వాణం, ఫీడర్‌ చానెళ్ల ఏర్పాటు తదితర పనులకూ ప్రాధాన్యం ఇస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో పనులు చేపట్టనున్నాం. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని డీఆర్‌డీఓ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. అలాగే స్వచ్ఛభారత్‌లో భాగంగా పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన నిర్మిస్తామని చెప్పారు.  

ఈ ఏడాది రూ.80 కోట్లు ఖర్చు 
ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. దాదాపు 10 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.80 కోట్లు ఖర్చు చేశారు. 7,200 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. హాజరైన కూలీల కు సుమారు రూ.57 కోట్లు కూలి రూపంలో చెల్లించారు. మరో రూ.24 కోట్లను మెటీరియల్‌ పనులకు ఖర్చు చేశారు. మార్చి 31లోగా మరో రూ.10 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement