
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు వివిధ విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కొచ్ 55వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఢిల్లీలో జరిగింది. పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు సిరిసిల్ల మున్సిపాలిటీకి 5, మెదక్కు 2, íపీర్జాదిగూడకు 1, బోడుప్పల్కు 3, సూర్యాపేటకు 1 అవార్డు, మెప్మాకు 6 అవార్డులు దక్కాయి.
సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సూర్యపేట కమిషనర్ ఎన్ శంకర్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీదేవి, బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. ఆస్తి పన్ను వసూలు, సిటిజన్ సర్వీస్ సెంటర్, వ్యర్థాల శుద్ధి విభాగాల్లో సిరిసిల్ల మెరుగైన ఫలితాలు సాధించేలా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించేందుకు దోహదపడ్డాయని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని ఆమె పేర్కొన్నారు.