
సౌదీలో జైలు పాలైన తెలంగాణ కార్మికులు
సంక్షోభం కారణంగా ముమ్మరంగా తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న 150 మందికి పైగా అరెస్టు
మోర్తాడ్: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న సంక్షోభం తెలంగాణ కార్మికుల ఉపాధికి విఘాతం కలిగిస్తోంది. అక్కడ కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభాన్ని అణచివేయడానికి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 150 మందికిపైగా కార్మికులను వారం రోజుల వ్యవధిలో జైలులో పెట్టినట్లు తెలిసింది. మొదట కంపెనీ వీసాలపై సౌదీకి వెళ్లినా, అక్కడి పరిస్థితులు బాగాలేక పోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి దొరికిన పనిచేస్తూ ఎంతో కొంత ఎక్కువ సొమ్మును సంపాదించుకునే వారిలో తెలంగాణ జిల్లాల కార్మికులు చాలామంది ఉన్నారు.
ఒప్పందం ప్రకారం కంపెనీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడం, పని భారం ఎక్కువగా ఉండటంతో అప్పులు తీర్చే మార్గం కోసం అనేక మంది కార్మికులు వీసా, వర్క్పర్మిట్, పాస్ పోర్టులను వదిలివేసి నిబంధనలకు విరుద్ధంగా సౌదీలో పని చేస్తున్నారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో సౌదీ పోలీసులు తనిఖీలు చేస్తుండటం తో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్మికులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది కార్మికులు సౌదీ జైళ్లలో మగ్గుతున్నారు. మళ్లీ కొత్తగా అరెస్టులు మొదలు కావడంతో కార్మికుల్లో ఆందోళన నెల కొంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సౌదీ జైళ్లో మగ్గుతున్న కార్మికులను సొంత గ్రామాలకు రప్పించి ఉపాధి చూపాలని పలువురు కోరుతున్నారు.