
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ యవనికపై తెలంగాణ భాష, సాహిత్యానికి పట్టం కట్టేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు రమణాచారి పేర్కొన్నారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి రవీంద్రభారతిలో రెండ్రోజుల్లో కార్యాలయం ఏర్పాటు చేసి సలహాలు స్వీకరిస్తామన్నారు. గురువారం ఆయన సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎ.శ్రీధర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారా యణలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా మహాసభలు జరుగుతాయని, తెలుగువారు అధికంగా ఉన్న దేశం లోని ఇతర నగరాలు, విదేశాల్లోని నగరాల్లో త్వరలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి వెబ్సైట్ ప్రారంభిస్తామని చెప్పారు.
ఉత్సవాలకు రూ.50 కోట్లు..
ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని, ప్రత్యేకంగా సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు ఇచ్చి ందని రమణాచారి తెలిపారు. మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. పత్రికల్లో కూడా తెలంగాణ భాష, సాహిత్య ఔన్నత్యాన్ని కళ్లముందు కట్టేలా కథనాలు రావాలని, ఉత్తమ కథనాలకు పురస్కారాలు కూడా ప్రదానం చేస్తామ న్నారు. తెలంగాణ సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పటమే వేడుకల ఉద్దేశమని నందిని సిధారెడ్డి అన్నారు. 50 మంది తెలంగాణ వైతాళికులకు సంబంధించిన పుస్తకాలను వెలువరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్యానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ప్రాచుర్యం లభించిందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రభాకరరావు అన్నారు. తెలంగాణ చరిత్ర, సాహిత్యం, దేవాలయాలు, శాసనాలు, జలవనరులు.. అన్ని వివరాలతో ప్రత్యేక సంచికను త్వరలో వెలువరిస్తామని తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ పేర్కొన్నారు.
నెక్లెస్రోడ్డులో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు
ప్రస్తుతం ట్యాంక్బండ్కే పరిమితమైన వైతాళికుల విగ్రహాలు నెక్లెస్రోడ్డులోకి కూడా చేరనున్నాయి. తెలంగాణ వైతాళికుల విగ్రహాలను నెక్లెస్రోడ్డులో కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు రమణాచారి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసిన ఓ కమిటీ విగ్రహాల విషయాన్ని పరిశీలిస్తోందని, ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ విగ్రహాల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment