
సాక్షి, హన్మకొండ: ప్రజాప్రతినిధిగా గెలుపొంది.. శాసనసభలో అడుగుపెట్టినా.. ఆయన చదువును మాత్రం ఆపలేదు. దూరవిద్యలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో పరీక్షలు రాశారు. ఆయనే ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో జీవన్రెడ్డి ఎల్ఎల్ఎం అభ్యసిస్తున్నారు.
ఎల్ఎల్ఎం విద్యలో భాగంగా ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది రెండు సెమిస్టర్ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని, పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గుర్తుకువచ్చాయని అన్నారు.