అవినీతికి ఆమడ దూరంలో ప్రభుత్వాన్ని నడుపుతామన్న ప్రధాని మోడీ అవినీతిపరులకు అండగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు ఆరోపించారు.
జడ్చర్ల (మహబూబ్నగర్ జిల్లా) : అవినీతికి ఆమడ దూరంలో ప్రభుత్వాన్ని నడుపుతామన్న ప్రధాని మోడీ అవినీతిపరులకు అండగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు ఆరోపించారు. గురువారం ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జడ్చర్ల వద్ద జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టిన అనంతరం వీహెచ్తో సహా ఎమ్మెల్యేలు సంపత్కుమార్,చిట్టెం రాంమ్మోహన్రెడ్డి, మాజీ ఎంపీలు మల్లు రవి, విఠల్రావు తదితరులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ యూపీఏ పాలనలో 2జీ స్కామ్, కోల్గేట్, ఆదర్శ స్కామ్లకు సంబంధించి పార్లమెంట్లో ఇప్పుడున్న మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లు గగ్గోలు పెట్టి పార్లమెంట్ను అడ్డుకోవడంతో.. స్కాంలు రుజువుకాకున్నా ప్రజలకు ఉపయోగకరమైన పార్లమెంట్ సమావేశాలు కొనసాగాలన్న ఉద్దేశ్యంతో యూపీఏ మంత్రులు నట్వర్సింగ్ మొదలుకుని దాసరి నారాయణరావు, పవన్కుమార్ భన్సద్, అశ్వినీ కుమార్లను మంత్రి పదవులకు తమ అధినేత్రి సోనియాగాందీ రాజీనామాలు చేయించారని గుర్తు చేశారు.
ఇప్పుడు లలిత్మోడి వ్యవహారంలో ఇరుక్కుపోయిన మంత్రి సుష్మాస్వరాజ్, వసుందర రాజేల రాజీనామాలు, మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం తదితర అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన వాటిపై తాము పార్లమెంట్లో నిలదీసి రాజీనామాలకు డిమాండ్ చేస్తే అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించడం తగదన్నారు. తమను పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే అభివృద్ది నిరోధకులుగా బీజేపీ ప్రచారం చేస్తుండడంతోనే వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.