
నా బంగారం లేకుండా బతకలేను..
వేములవాడ: ‘అమ్మా.. నన్ను క్షమించు.. నా బంగారం (ప్రేమించిన యువతి) లేనిదే బతకలేనని నీకు ముందే చెప్పా.. అందుకే మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నా మిత్రుడు మిథున్కు చెందిన బంగారంపై నేను లోను తీసుకున్నా.. ఆ లోను చెల్లించి బంగారం వాడికి అప్పగించండి’ అని సూసైడ్ నోట్ రాసి రాపర్తి హరీశ్ (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మవీధిలో శనివారం జరిగింది.
హరీశ్ తన తల్లి, సోదరితో కలిసి కొన్నేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఇటీవలే ఆ ఇంటిని ఖాళీ చేసి సుబాష్నగర్లోని మరో అద్దె ఇంటికి మారారు. శుక్రవారం సాయంత్రం వరకూ తాను నడిపిస్తున్న టిఫిన్ సెంటర్లో పనులు పూర్తి చేసుకున్న హరీశ్.. ఇంటికొచ్చి తల్లిని పలుకరించి బయటకు వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు కుటుంబ సభ్యులకు చెందిన వాట్సాప్ గ్రూప్లో ‘ఐ మిస్యూ ఆల్’ అంటూ మెసేజ్ పెట్టడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో బంధువులు, మిత్రులు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గతంలో వీరు అద్దెకున్న ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో చూసిన స్థానికులు హరీశ్ తల్లి విజయకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా, హరీశ్ దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. విగతజీవుడైన కుమారుడిని చూసి తల్లి తల్లడిల్లిపోయింది.