
యువతి కడుపులో...150పాములు!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ యువతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు సైతం నివ్వర పోయే షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న నేహా బేగం(22)కు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులోంచి దాదాపు 150 బతికున్న వానపాములను వెలికితీశారు. దాదాపు 4 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి డాక్టర్లు పెద్ద సంఖ్యలో వాన పాములు(వార్మ్స్) ఉండడాన్ని చూసి షాక్ తిన్నారు.
వివరాల్లోకి వెళ్తే...చందౌలి కి చెందిన నేహా తరచూ కడుపునొప్పి, వాంతులతో బాధపడేది. ఎన్ని రకాలు మందులు తీసుకున్నా.. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. ఇక భరించలేని స్థితిలో చివరికి కేజీ నందా ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. ఆమె పేగుల్లో ఏదో ఆడ్డుపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆమె పేగుల్లోంచి 10 అంగుళాల పొడవైన దాదాపు 150 బతికున్న వానపాములు బయటికి తీశారు.
సాధారణంగా 3 లేదా 4 వాన పాములు బయట పడుతుంటాయని, కానీ మానవ శరీరంలో ఇంత పెద్ద సంఖ్యలో వానపాములు బయట పడడం మాత్రం ఇదే తొలిసారని మేల్ గైనకాలజిస్టు డాక్టర్ ఆనంద్ ప్రకాష్ తివారీ చెప్పారు. తామే దిగ్బ్రాంతికి గురయ్యామన్నారు.
అనారోగ్యమైన జీవనశైలి కారణంగానే శరీరంలో ఇలాంటి క్రిములు పెరుతాయన్నారు. రక్తప్రవాహంలో ప్రవేశించి అనంతరం శరీరంలోపల పెరుగుతాయని డాక్టర్ తివారీ చెప్పారు. ఈ జీవులు ఆమె మెదడులోకి ప్రయాణించి ఉంటే.. ప్రాణానికే ముప్పు వచ్చేదన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పారు.
భరించలేని కడుపునొప్పి, వాంతులతో విలవిలలాడిపోయేదాన్నని, ఎన్నోనిద్రలేనిరాత్రుళ్లు గడిపానని నేహ తెలిపింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.